అందరి కంటే భిన్నంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.ఆ వైఖరి కారణంగానే ఆయన అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయికి చేరుకోగలిగారు.
ఇక కాంగ్రెస్ తెలంగాణలో బలహీనంగానే ఉన్నా, రేవంత్ మాత్రం బలమైన శక్తిగా అధికార పార్టీ టిఆర్ఎస్ ను భయపడుతూనే వస్తున్నారు.ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో డిసైడ్ చేయబోతున్న క్రమంలో ఇక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ కానీ ఆయన భార్య కానీ పోటీ చేసే అవకాశం ఉండడంతో టిఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే విషయం గత కొద్ది రోజులుగా ఉత్కంఠ కలిగిస్తూనే ఉంది.కాంగ్రెస్ లో ఉన్నప్పుడు హుజురాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డి కే అనే ప్రచారం జరిగినా, రేవంత్ ఆయన విషయంలో అంతా సానుకూలంగా లేకపోవడం, ఆ తరువాత కౌశిక్ ఆడియో టేప్ బయటకు రావడంతో కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిపోయారు.దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో మాత్రం సరికొత్త ఆలోచన లో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది.
పిసిసి అధ్యక్షుడు అయిన తరువాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే సక్సెస్ అవుతాము అనే విషయంపై రహస్యంగా ఓ సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేసి టిఆర్ఎస్ బిజెపిలకు జలక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట.
టీఆర్ఎస్ కంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ బలమైన వ్యక్తి కావడం, ఈ నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని, సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు అభ్యర్థిని ఎంపిక చేయాలని రేవంత్ చూస్తున్నారట.అంతేకాదు టిఆర్ఎస్ తమ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాలనేది రేవంత్ నిర్ణయంగా తెలుస్తోంది.