టిఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టిఆర్ఎస్ అధికారికంగా ఖరారు చేయడంతో , కాంగ్రెస్ బిజెపిలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది.దాదాపు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖాయం అయింది.
దీంతో అక్కడి నుంచి రాజేందర్ నే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అయితే కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు.
ఎవరి నిలబడితే ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది.
తెలంగాణలో సురేఖ కు గట్టిపట్టు ఉండడం, ఆమె పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈ రెండు ఈక్వేషన్ లు కలిసి వస్తాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కాకపోతే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కొండా సురేఖ అంత ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.
అయితే రేవంత్ రెడ్డి మొదటి నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పైన ఎక్కువగా దృష్టి పెట్టారు.ఆయన అయితే సరైన అభ్యర్థి అవుతారని, కరీంనగర్ జిల్లా నుంచి ఆయన ఎంపీగా గతంలో పోటీ చేసి గెలవడం , హుజురాబాద్ తో పాటు జిల్లా అంతటా మంచి పరిచయాలు ఉండడం, ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి కావడం, గౌడ సామాజిక వర్గం ఇలా అన్ని లెక్కలతో ఆయనే సరైన అభ్యర్థి అవుతారు అనేది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది.
ఈటెల రాజేందర్ వంటి బలమైన అభ్యర్థిని ఢీ కొట్టేందుకు, టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న గేల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం దక్కకుండా చేసేందుకు రేవంత్ పేరుని ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే పొన్నం పేరును ప్రకటించక ముందే ఇక్కడ ఎవరిని నిలబడితే సునాయాసంగా గెలుస్తారనే దానిపై ఒక రహస్య సర్వే కూడా రేవంత్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.హుజురాబాద్ లో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం తో ఆయన పేరే దాదాపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.