తెలంగాణలో బలమైన నేతగా, కెసిఆర్ కు దీటైన నాయకుడిగా ఇప్పుడిప్పుడే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో పడింది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆ పార్టీ నేతలే ఆయనకు ప్రతిపక్షంగా మారిపోయారు.సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉండడమే కాకుండా పార్టీ అధిష్టానం ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తుందేమో అన్న భయం వారిలో ఉంది.
అందుకే రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా అధిష్టానం దగ్గర తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అనేక ఫిర్యాదులు చేస్తూనే వస్తున్నారు. రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి యుద్ధము అనే ఆలోచన అధిష్టానానికి ఉన్నా, సీనియర్ నాయకుల తల నొప్పి భరించలేక ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తోంది.
అయినా రేవంత్ అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసే విధంగా నిరంతరం టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ కేసీఆర్ కేటీఆర్ వంటి వారిని ఏ విధంగా ఇరుకున పెట్టాలి అనే విషయం పై రాజకీయం చేస్తూ వస్తున్నారు.అన్నీ కలిసి వస్తే కాంగ్రెస్ తరపున ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయి ఉన్న నేతగా తెలంగాణలో అతికొద్ది సమయంలోనే ఎదిగారు.
గతంలో ఆయన టిడిపి లో ఉండగా ఉమ్మడి రాష్ట్రం లోనూ రేవంత్ హవా నడిచింది. చంద్రబాబు ఆయనకు మంచి ప్రాధాన్యం ఇచ్చేవారు.
అన్ని విషయాల్లోనూ రేవంత్ కు ప్రోత్సాహం ఇచ్చేవారు.అయితే అనుకోకుండా రేవంత్ ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నారు.
ఈ కేసులు టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇస్తున్న దృశ్యాలు స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటకు వచ్చాయి.
ఈ వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్ అవుతారని అంతా అభిప్రాయపడ్డారు.
అయితే కోర్టు వివాదంలో చివరకు చంద్రబాబుకు ఊరట కలగగా, ఇప్పుడు రేవంత్ ఈ కేసులో ఇరుక్కుపోయారు.ఈ కేసు లో అంతిమ తీర్పు ఎలా ఉన్నా , ఇది రేవంత్ రాజకీయ జీవితానికి పెద్ద మచ్చగానే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయి వ్యక్తి ఈ విధంగా అవినీతి వ్యవహారంలో ప్రథమ నిందితుడు గా ఉండడం, ఇబ్బందికరమే.అసలు మిగతా పార్టీలు విమర్శలు చేసినా చేయకపోయినా, ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ సీనియర్లు తమకు అవకాశంగా మలుచుకుని రేవంత్ పై విమర్శలు చేసేందుకు, పార్టీ అధిష్టానం వద్ద ఆయన పరపతి తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది.
టీడీపీలో ఉండగా, రాజకీయ ఎదుగుదల కోసం చంద్రబాబు తో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, ఆయన ఆదేశాల మేరకు స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇస్తూ రేవంత్ ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు.కానీ అసలు సూత్రధారి చంద్రబాబు ఈ కేసులో ఊరట పొందారు.
ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసు కాంగ్రెస్ కీలక స్థానంలో ఉన్న రేవంత్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.