టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి విరుగుడుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.భారీఎత్తున ఈ సభకు జనసమీకరణ చేసి టిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వాలనే ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు.
గజ్వేల్ లో నిర్వహించబోతున్న ఈ సభ పై రేవంత్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సభను సక్సెస్ చేయాలని రేవంత్ కసిగా ఉన్నారు.
అంతే స్థాయిలో ఈ సభను ఫెయిల్యూర్ చేసేందుకు టీఆర్ఎస్ వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.
నేరుగా కిందిస్థాయి నాయకులకు ఈ సభ విషయంలో కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు.గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులను, డీలర్లను ఆర్ఎంపీల ను ఇలా అందర్నీ పిలిపించుకుని మరి ఈ సభ ఏ విధంగా ఫెయిల్యూర్ చేయాలనే విషయంపై చర్చిస్తున్నారు.
అలాగే సెప్టెంబర్ 17 వ తేదీన ప్రతి గ్రామంలోనూ కనీసం 500 మందికి భోజనాలు పెట్టే విధంగా టిఆర్ఎస్ మీటింగులు నిర్వహించాలని , కింది స్థాయి నాయకులకు ఆదేశాలు వెళ్లాయి.అలాగే తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఈ నియోజకవర్గంలో అదేరోజు పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు మొత్తంగా రేవంత్ సభ ను విఫలం చేసేందుకు టిఆర్ఎస్ ఎన్ని రకాల ఎత్తులు వేయాలో అన్నిటిని వేస్తూ , రేవంత్ సభను ఫెయిల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఈ వ్యవహారాన్ని తిప్పికొట్టేందుకు, టిఆర్ఎస్ కు చెక్ పెట్టే విధంగా సరికొత్త రూట్లో వెళ్తున్నారు .
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బూత్ నుండి కనీసం ఏడుగురు ని అయినా సభకు తరలి వచ్చేలా చూడాలని పిలుపు ఇస్తున్నారు.గజ్వేల్ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా తరలిరావాలని రేవంత్ పిలుపు ఇస్తున్నారు.కనీసం లక్ష మందితో అయినా ఈ సభను నిర్వహించి ఈ మీటింగ్ ను సక్సెస్ చేయడం ద్వారా, హుజురాబాద్ లో గట్టి పోటీ ఇవ్వాలనే వ్యూహంతో రేవంత్ ముందుకు వెళ్తున్నారు.