తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలన్ని ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి.
అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎత్తులు వేస్తున్నాయి.ఒంటిరిగా ఎవరికి వారు తమ వ్యూహాలను రచించు కుంటున్నారు.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ గా మల్కాజ్ గిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత పార్టీలో కొంత నూతన ఉత్తేజం అయితే వచ్చింది.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే స్థానం గురించి ఇటీవల కాలంలో రక రకాల వార్తలొస్తున్నాయి.
ఎల్బీనగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఈ మేరకు అంచనా వేశాయి.కానీ, తాను మళ్లీ తన సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ నుంచే బరిలో దిగుతానని క్లారిటీ నిచ్చారని తెలుస్తోంది.
ఓడిన చోటనే మళ్లీ తన గెలుపునకు బాటలు వేసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.రేవంత్ రెడ్డి రెండు సార్లు ఆ నియోజకవర్గం నుంచి శాసన సభ సభ్యుడిగా గెలుపొందారు.
ఇకపోతే ఇటీవల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు ప్రారంభించగా, కొడంగల్ నియోజకర్గంలో 75 వేల మంది కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రేవంత్ భావోద్వేగానికి గురయ్యారు.కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేత సన్మానం చేయిస్తానని హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్.ఇకపోతే తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడంగల్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేయించానని, కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యే ఏం చేయడం లేదని విమర్శించారు.
కొడంగల్ ను దత్తత తీసుకున్న కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.ఈ మూడేళ్లలో కొడంగల్ రోడ్లపై తట్టెడు మట్టి తీయలేదని ఆరోపించారు.2018లో ఐదుగురు మంత్రులు కోస్గి బస్ డిపోకు శంకుస్థాపన చేశారని, కానీ, ఇంత వరకూ డిపోను కట్టలేదని వివరించారు.కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు రేవంత్ సవాల్ చేశారు.
ఇకపోతే తన నియోజకవర్గంలో సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదైన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే రేవంత్ బరిలోకి దిగుతారని, గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.