ఎట్టకేలకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.
సొంత పార్టీ నేతల నుంచి సహకారం లేకపోయినా, జాతీయ నాయకుల వద్ద నమ్మకాన్ని సంపాదించుకోగలిగారు.ఆ నమ్మకమే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఆయనను నియమించే వరకు తీసుకు వెళ్ళింది.
మొదటి నుంచి రేవంత్ రెడ్డి దూకుడు స్వభావంతోనే ఉండేవారు.ఆ స్వభావమే ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చింది.
ఇప్పుడు తెలంగాణలో ప్రధాన పార్టీ గా ఉన్న బిజెపి కాంగ్రెస్ పార్టీ లకు ముచ్చెమటలు పట్టించే స్థాయికి ఎదిగారు అంటే, రేవంత్ సత్తా ఏమిటో అర్థం అవుతోంది.రేవంత్ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే.
మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ విద్యార్థి దశలోనే చురుగ్గా వ్యవహరించేవారు.రాజకీయాలపై ఆసక్తి తోనూ ఉండేవారు.ఆ ఆసక్తితోనే ఆయన టిఆర్ఎస్లో చేరి ఎంపీటీసీ టికెట్ ను ఆశించారు.కానీ ఆ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్గిల్ జెడ్పిటిసి గా ఆయన విజయం సాధించారు.2008లో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.
ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009 -2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు అఖండ మెజారిటీతో విజయం సాధించారు.టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఆయనకు అదేవిధంగా ప్రోత్సాహం అందించారు.దీంతో రాష్ట్రస్థాయి నేతగా రేవంత్ ఎదిగారు.
టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీపై విరుచుకుపడుతూ ఉండేవారు.
ఆ తరువాత పరిస్థితుల్లో తెలుగుదేశం పూర్తిగా బలహీనం కావడం, ఏపీ తెలంగాణ విభజన జరగడం తదితర కారణాలతో ఆయన కాంగ్రెస్ లో చేరారు.అక్కడ తగిన గుర్తింపు పొందడంతో, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.అలాగే 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ విజయం సాధించారు.
ఇక అప్పటి నుంచి పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ కు అన్నీ తానై రేవంత్ వ్యవహరిస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై పోరాడుతూనే ఉన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయన దూకుడును, రాజకీయ వ్యూహాలను గమనించి ఆయనను తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమించింది.
ఈ నియామకం పై మొదట్లో కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినా, చివరకు రేవంత్ కు జై కొట్టారు. ఈ విధంగా జెడ్పీటీసీ , ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ , కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ ప్రస్థానం కొనసాగుతోంది.