ఎన్నో ఉత్కంఠ పరిణామాలు, ఎన్నో అవమానాలు , ఎన్నో ఒత్తిళ్లు , మరెన్నో పోటీల ను తట్టుకుంటూ ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్టానం చేత ఎంపిక చేయబడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.అసలు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దక్కుతుందని చాలా కాలం నుంచి చర్చ నడుస్తున్న, ఎప్పటికప్పుడు సీనియర్ నాయకులు దీనిని వాయిదా వేయించేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతూ వచ్చారు.
ఏదైతేనేం చివరకు తెలంగాణ కాంగ్రెస్ రథసారధిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు.మొన్నటి వరకు తన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు, తనకు పదవి దక్కితే పార్టీకి రాజీనామా చేస్తానంటూ హడావుడి చేసిన సీనియర్ నాయకులు అందరినీ రేవంత్ బుజ్జగించేశారు.
మనం మనం బరంపురం అన్నట్లుగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కలిసి పోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ ఏకైక ధ్యేయం అంటూ రేవంత్ కు మద్దతుగా అందరూ చేతులు కలుపుతున్నారు.
అయితే కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా భయపెడుతున్నాయట.తెలంగాణ కాంగ్రెస్ కు బలం లేకపోయినా, రేవంత్ చేసే విమర్శలు తమకు ఎంతో డ్యామేజ్ కలిగిస్తున్నాయి అనేది కెసిఆర్ అభిప్రాయం.
దీనికి తగ్గట్లుగానే కేసీఆర్, కేటీఆర్ అవినీతి వ్యవహారాలతో పాటు టిఆర్ఎస్ నేతలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను రేవంత్ బయటపెడుతూ హడావుడి చేస్తూ ఉంటారు.గత ఏడేళ్లుగా ఏకచక్ర ఆధిపత్యం అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
అప్పుడప్పుడు రేవంత్ వంటివారు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు కారణంగా ఎక్కువ పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై రేవంత్ దృష్టి పెడుతూ ఉండేవారు.ఇక ఇప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో నిరంతరం టిఆర్ఎస్ పైన పోరాటం చేసే విధంగా ఆయన ప్రణాళిక రచించుకుని తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం, వంటి వ్యవహారాలు కేసిఆర్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.అందుకే ఎప్పుడూ లేని విధంగా జనాల్లో తిరుగుతూ అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ , కేసీఆర్ అందరివాడుగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్ తెలంగాణలో తమకు పోటీ కాకపోయినా , రేవంత్ ఒక్కడి వల్ల జరిగే నష్టం ఏమిటో కేసీఆర్ గ్రహించడంతోనే ఇంతగా టెన్షన్ పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.