పేరుకే మంత్రిగా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్.తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రతి శాఖలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు.
పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన మాటకు ఎదురు లేకుండా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.అసలు ఈ కరోనా వైరస్ ప్రభావం లేకపోయి ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించి ఉండేవారు.
ప్రస్తుతం మంత్రిగా ఉన్నా సరే ముఖ్యమంత్రి స్థాయిలోనే కేటీఆర్ చక్రం తిప్పుతున్నారు.తాజాగా కెసిఆర్ లేకుండానే కేటీఆర్ రాష్ట్ర మంత్రులతో సమావేశం నిర్వహించడం, రెగ్యులర్ గా కెసిఆర్ మంత్రులతో ఏ విధంగా అయితే సమావేశాలు ప్రగతి భవన్ లో నిర్వహిస్తారో అదేవిధంగా ఈ సమావేశం ప్రగతి భవన్ లో జరిగింది.
ఈ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు, అన్ని శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు.కెసిఆర్ ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో ఉండడం కెసిఆర్ ఆదేశాలతోనే ఈ మీటింగ్ నిర్వహించినట్లు గా కేటీఆర్ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ లో అన్ని అంశాలకు సంబంధించిన చర్చలు జరిగాయి.ఇది సాధారణ సమావేశమేనని కేటీఆర్ చెబుతున్నప్పటికీ, ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు ప్రగతిభవన్ లో కేసీఆర్ మాత్రమే మంత్రులతో సమావేశం నిర్వహించారు.
కానీ మొదటిసారిగా కేటీఆర్ ప్రగతిభవన్ లో మంత్రులతో మీటింగ్ నిర్వహించడం పై ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇదంతా కేటీఆర్ కు రిహార్సల్ మాత్రమేనని, త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని, దానిలో భాగంగానే ఇప్పటి నుంచే ఆయనకు ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలు.కేటీఆర్ కు ఈ విధంగా ప్రాధాన్యం కల్పించడం ద్వారా త్వరలోనే ఆయనకు సీఎం బాధ్యతలు అప్పగించబోతున్నారు అనే సంకేతాలను కెసిఆర్ ఇచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.