తెలంగాణ దూకుడుగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ డిసైడ్ అయిపోయింది.ఈ మేరకు అధిష్టానం పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి.
ఈ మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు విషయమై సీరియస్ గా నే ఆలోచన జరుగుతోందట.ఎవరిని ఏ పదవిలోకి తీసుకోవాలి.? ఏ కార్యక్రమాలు చేపట్టాలనే విషయంలో అధిష్టానం పెద్దలు దృష్టి సారించారు.మొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు.
ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.దీంతో ఎక్కడెక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించాలి ? ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలనే విషయంలో అన్నీ రేవంత్ నిర్ణయం మేరకు జరిగాయి. దీంతో కమిటీల వ్యవహారం పక్కకు వెళ్లిపోయింది .అయితే కాంగ్రెస్ కు మళ్ళీ పునర్వైభవం రావాలంటే కొత్త కమిటీ ఏర్పాటుతో పాటు, డిసిసి అధ్యక్షుల నియామకాలపై సీరియస్ గా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు రావడంతో, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, జిల్లాల పర్యటనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు.
ముందుగా డిసిసి అధ్యక్షులు నియామకం చేపట్టి, పాత కమిటీలను భారీగా ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు విషయంతో పాటు, డిజిటల్ మెంబర్ షిప్ పై నేతలకు పార్టీ కేడర్ కు అవగాహన కల్పిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో వీటిని ఎవరు ఎలా నిర్వహిస్తారు అనేది పూర్తిగా వారికే వదిలేయనున్నారు. జనవరిలో కొత్త డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ మొదలు పెట్టి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు.
ఈ కొత్త కమిటీల్లో పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తూ, క్రమశిక్షణతో మెలిగే వారిని డిసిసి అధ్యక్షులుగా నియమించాలని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.అలాగే నియోజకవర్గ ఓటర్ల లో 10% సభ్యత్వం నమోదు చేస్తే పార్టీ పదవులు ఇచ్చే విషయంలో పరిగణలోకి తీసుకుంటామని కండిషన్ కూడా పెట్టబోతున్నారట.
అలాగే జిల్లాలో బలమైన రాజకీయ పునాదులు ఉన్నవారికి కొత్త డిసిసి అధ్యక్షుల నియామకం లో ప్రాధాన్యం ఇవ్వాలనేది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పిసిసి అధ్యక్షుల్లో చాలా మందిని మార్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తో పాటు నియోజకవర్గ ఇన్చార్జి ల విషయంలోనూ భారీ ప్రక్షాళన చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.ఈ మేరకు నియోజకవర్గ ఇన్చార్జి ల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు.
వారి పనితీరు ఆధారంగా వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి అనేది రేవంత్ అభిప్రాయమట.మొన్నటి వరకు ఎలా ఉన్నా , ఇక నుంచి దూకుడుగా కాంగ్రెస్ ను తెలంగాణలో తీసుకువెళ్లాలని , అన్ని విషయాలను భారీ ప్రక్షాళన చేపట్టి తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం దక్కేలా చేయాలనే వ్యూహంలో రేవంత్ ఉన్నారట.
దీనికి అధిష్టానం పెద్దల నుంచి మద్దతు లభిస్తుండడం తో దూకుడుగా ముందుకు వెళ్లేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు.