తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం పట్నం గోస పేరుతో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గతంలో కొనుగోలు చేసిన వ్యవహారాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం వెలికితీసింది.దీనిపైన టిఆర్ఎస్ పై రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారు.
మీ ఇష్టం వచ్చింది చేసుకోండని, ప్రభుత్వం, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు.ఈ పొలిటికల్ వాతావరణం ఇలా హీట్ ఎక్కుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రాణ హాని ఉందని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
తన హత్యకు కుట్ర పన్నుతున్నారని, తెలంగాణలో అత్యంత బలమైన వ్యక్తులతో పోరాడుతున్నానని, అందుకే తనను హత్య చేయించాలని చూస్తున్నారని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు, మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు పేరును కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.కేసీఆర్ తో పాటు ఆయన సన్నిహితుల భూ అక్రమాలపై కోర్టులో పోరాటం చేస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్ తనను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతున్నారని, ముఖ్యంగా మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని రేవంత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి అదనపు భద్రత కోసం చాలాకాలం నుంచి పోరాటం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ కి భద్రత ఎక్కువగానే ఉండేది.ఆ తర్వాత తగ్గించారు.దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.ప్రస్తుతం ఆయన హత్యకు కుట్ర జరుగుతుంది అని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది.అయితే దీనిపై టిఆర్ఎస్ కూడా స్పందించింది.కేవలం భద్రత పెంచుకునేందుకు మాత్రమే ప్రభుత్వం పైన, అధినేత కేసీఆర్పైనా రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని, అందులో ఎటువంటి వాస్తవం లేదని, ఈ విధంగా ఆరోపణలు చేస్తే కేంద్రం ఆయనకు భద్రత పెంచుతుందని నాటకాలు ఆడుతున్నారని, టిఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుకి చేరడంతో ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి.