ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చావో రేవో అన్నట్లుగా ఉంది.సరైన నాయకత్వం లేక ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో విఫలం కావడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం కోల్పోయిన పరిస్థితి ఉంది.
అందుకే దుబ్బాక ఉప ఎన్నికలో గ్రేటర్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అంతగా సత్తా చాటలేదనే చెప్పవచ్చు.అయితే రోజురోజుకు బీజేపీ సత్తా చాటుతున్న పరిస్థితులలో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మేల్కొనకపోతే ప్రజల్లో మనుగడ కోల్పోయే అవకాశం ఉంది.
ఇది గ్రహించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించినా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ల నుండి సరైన మద్దతు దొరకలేదు.
ఐకమత్యంగా ఉండి సాధిస్తేనే ప్రజలకు మంచి సంకేతం వెళ్లడమే కాకుండా ప్రజలకు తమ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని నమ్మకం కలుగుతుంది.కాని ఒక్కడిగా రేవంత్ రెడ్డి పోరాడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూరినా అందరూ కలిసి పోరాడితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు అవకాశాలు దొరుకుతాయి.
ఇకనైనా కాంగ్రెస్ నేతలు గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి అందరూ కలిసి ప్రజల సమస్యలపై పోరాడితే ఉన్న పట్టును నిలుపుకొనే అవకాశం ఉంది.