తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి రకరకాలుగా ఉంటోంది.మొదటి నుంచి గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా తెలంగాణ కాంగ్రెస్ ఉంటూనే వస్తోంది.
చెప్పుకోవడానికి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నా, వారి మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉండడంతో, పార్టీ పరిస్థితిని పక్కనపెట్టి ఒకరిపై ఒకరు పట్టు సాధించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తున్నారు.ఈ కారణాలతో తెలంగాణలో కాంగ్రెస్ బాగా బలహీనపడింది.
దీనినే టీఆర్ఎస్ , బిజెపి పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి.ఈ పరిస్థితిని చూసి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వంటి నేతకు ఆ పార్టీ అధిష్టానం పదవి కట్టబెట్టింది.
మొదట్లో దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు రేవంత్.అయితే సీనియర్ నేతల నుంచి సహకారం అంతంత మాత్రంగా ఉండడం, ఇప్పటికీ రేవంత్ ను అధ్యక్షుడిగా ఒప్పుకునెందుకు చాలామంది ఇష్టపడకపోవడం, ఎవరికి వారే గొప్ప నాయకులు అన్నట్లుగా వ్యవహారాలు చేయడం, ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.
ముఖ్యంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారు ఇప్పటికి పట్టించుకోనట్లు గానే వ్యవహరిస్తున్నారు.ఇటీవల వైఎస్ సంస్మరణ సభకు ఎవరు వెళ్లొద్దు అంటూ రేవంత్ ఆదేశాలు జారీ చేసినా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.దీనిపై రేవంత్ రెడ్డి సూటిగానే ప్రశ్నించారు.దీనికి వెంకటరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.తాను కాంగ్రెస్ నేత వైఎస్ సంస్మరణ సభ కు మాత్రమే వెళ్లానని, ఇతర నేతలు లాగా టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్ళి కాళ్ళు మొక్కి రాలేదని రేవంత్ కు ఘాటుగా సమాధానం ఇచ్చారు.రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడిన ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లడాన్ని వెంకటరెడ్డి తప్పుపట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకున్న ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, అసలు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు బలమైన పార్టీగా ఉన్న బిజెపి, టిఆర్ఎస్ లకు ధీటుగా కాంగ్రెస్ ను బలోపేతం చేయాల్సి ఉన్నా, ఇంటి పోరుని చక్కబెట్టడమే రేవంత్ కు అతి పెద్ద సవాల్ గా మారిపోయింది.