తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ ఎటువంటిదో అందరికీ తెలుసు. పదునైన మాటలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతూనే వస్తున్నారు.
ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుంటారు.పీసీసీ అధ్యక్షుడు కాకముందు నుంచి రేవంత్ కేసీఆర్ విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఏ విషయంలోనూ వెనుకడుగు వేయకుండా రేవంత్ పోరాటం చేయడం , ఆయన సారధ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి రాగలదు అని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు బలంగా నమ్మడం ఇలా ఎన్నో అంశాలు రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చిపెట్టాయి.రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో దృష్టిసారించి బీజేపీ , టీఆర్ఎస్ లోని అసంతృప్తి నాయకులను చేర్చుకోవడం తో పాటు, కాంగ్రెస్ లోనే ఉంటూ యాక్టివ్ గా లేని నాయకులందరినీ మళ్ళీ యాక్టిివ్ చేశారు.
అయితే అనూహ్యంగా ఈ మధ్యకాలంలో బీజేపీ బాగా బలం పుంజుకోవడం , దుబ్బాక హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడం పెద్ద ఎత్తున చేరికలపై దృష్టి పెట్టడం, ఉద్యమ నేపథ్యం ఉన్న కీలక వ్యక్తులను బీజేపీలో చేర్చుకోడం వంటి వ్యవహారాలు రేవంత్ రెడ్డి గ్రాఫ్ ను బాగా తగ్గిస్తూ వస్తున్నాయి.
ఇప్పుడు బీజేపీ నేతల దూకుడుతో రేవంత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉండడం, రేవంత్ ను ఆందోళనకు గురిచేస్తోంది.2023 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచినా, లేక ప్రధాన ప్రతిపక్షం గా మారినా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది అనడం లో సందేహం లేదు.ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా సమిష్టిగా కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టారు.
మొన్నటి వరకు రేవంత్ నాయకత్వాన్ని ఒప్పుకొని సీనియర్ నాయకులు ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ సమయంలోనే బీజేపీ మరింతగా యాక్టీవ్ అవ్వడం రేవంత్ కు కంగారు పుట్టిస్తోంది.తెలంగాణ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అన్న భావన మొన్నటి వరకు ఉన్న , ఇప్పుడు ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించడం వంటి పరిణామాలపై కాంగ్రెస్ నేతలలో ఆందోళన కు కారణంగా కనిపిస్తోంది.