తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే ఆ పార్టీ ఉనికి కోసం పోరాడుతూ వస్తోంది.
పార్టీలో కీలక నాయకులు చాలామంది టిఆర్ఎస్ బీజేపీ వైపు వెళ్లిపోగా, మొదటి నుంచి కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్న వారు మాత్రమే కొంతమంది వేరే పార్టీలోకి వెళ్లలేక, కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్నారు.కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతుండడంతో ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తూ వస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోవాలనే అభిప్రాయంతో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ, అనేక ప్రజా ఉద్యమాలు చేపడుతూ వస్తోంది.కానీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో మాత్రం ఆ ఊపు ఎక్కడా కనిపించడం లేదు.
అసలు తమ రాజకీయ ప్రత్యర్ధులతో పోరాటం చేసే విషయాన్ని పక్కనపెట్టి సొంత పార్టీ నాయకులతోనే తగాదాలు పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది.తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి నాయకులతో పాటు, పార్టీలోని సీనియర్ నాయకులు కలిసి ఓ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ గెలుపు కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, నాయకులు అందరినీ కలుపుకు వెళ్లాలని, ఇలా ఎన్నో విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆ సమావేశంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, నిరంజన్ మధ్య విభేదాలు తలెత్తడం, తర్వాత ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడం, కొట్టుకునే వరకూ పరిస్థితి వెళ్లడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది.ఈ అంశం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారడంతో పాటు, మీడియాలోనూ బాగా వైరల్ అయ్యింది.ఈ వ్యవహారంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు రాజకీయాలు సమస్య పోతున్నాయి, అంతా కలిసికట్టుగా అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయంలో ఉన్న వారంతా, మళ్లీ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు యధాతథంగా ఉన్నాయని, నాయకుల వ్యవహార శైలిలో మార్పు రాలేదని, ఇలా అయితే కాంగ్రెస్ కు భవిష్యత్తు కష్టమే అనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఒకపక్క తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి అధికారం దక్కించుకోవాలనే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్న సమయంలో, సొంత పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండడం ఆయనకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.ఇప్పటి వరకు ఎన్నో కేసులు ఎదుర్కుంటూ, పార్టీకి మేలు జరిగే విధంగా చేయాలని తాను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుందని రేవంత్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.