కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు టీటీడీపీ సిద్ధమైంది.టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేచే రేవంత్ రెడ్డి ఈ పోరాటానికి నాయకత్వం వహించనున్నాడు.
దీనికి ప్రత్యేకమైన కార్యాచరణను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నాడు.ప్రజా సంఘాలను ఐక్యం చేసి మంత్రులందరి నియోజకవర్గాల్లో నిరవధిక ఆందోళనలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాడు.
ఇందుకు సంబంధించి తొలుతగా ముగ్గురు టార్గెట్గా స్కెచ్ను కూడా సిద్ధం చేశాడు.ఆ ముగ్గురి నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు రేవంత్ ప్రకటించాడు.
దీంతో పాటు వీరిపై కేంద్ర మంత్రులకు సైతం ఫిర్యాదులు అందించనున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలను సంఘటితం చేసి నిరవధిక ప్రజాందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర మంత్రులందరి నియోజకవర్గాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు.
ఇందులో మొదటి విడతగా సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్, గృహ నిర్మాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గాల నుంచి వీటిని ప్రారంభిననున్నట్లు ప్రకటించారు.తొలి కార్యక్రమాన్ని గజ్వెల్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తామని గజ్వెల్ సభలో కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి అంశానికి ఒక విధానాన్ని రూపొందిస్తున్నామని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్.రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయానికి మాత్రం ఇప్పటి దాకా ఒక విధానాన్నిప్రకటించలేదని రేవంత్ విమర్శించారు.
రైతులను ఆదుకోవడంలోనూ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, దళిత గిరిజనులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్టీలు – మైనారిటీలు – వికలాంగులకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రేవంత్ ధ్వజమెత్తారు.