గత కొంతకాలంగా తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అనే విషయంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ప్రజలు, ప్రతిపక్షాల మధ్య కాకుండా, టిఆర్ఎస్ పార్టీ లోనూ ఈ వ్యవహారంపై జోరుగా ఊహాగానాలు చెలరేగుతునే ఉన్నాయి.
ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశంతోనే కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు అనే చర్చ చాలాకాలం నుంచి రాజకీయ వర్గాల్లో నడుస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశమే లేదని , అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న జరిగిన పార్టీ సమావేశంలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఖచ్చితంగా కెసిఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని, 2022 ఆగస్టు లో గుజరాత్ ఎన్నికలతో పాటు ,తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని రేవంత్ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు పైనా రేవంత్ విమర్శలు చేశారు.మంత్రి హరీష్ రావుకు చివరకు మిగిలేది మిత్ర ద్రోహి టైటిల్ మాత్రమే అని, కెసిఆర్ హరీష్ రావు ను పూర్తిగా ఇంటికి పంపే విధంగా ఎప్పుడో ప్లాన్ చేసారు అంటూ ఆరోపించారు.
అసలు టీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు ను ఎదుర్కొనేందుకే కేసీఆర్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు అంటూ విమర్శించారు.అసలు ఎవరూ అడగకుండానే కేసీఆర్ ముందస్తు ఎన్నికల చర్చ ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలి అంటూ రేవంత్ డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ పూర్తిగా అసహనం, అభద్రతా భావంతో ఉన్నారు అని, అందుకే ప్రతిపక్షాలను కుక్కలు నక్కలతో పోల్చుతున్నారు అంటూ రేవంత్ మండిపడ్డారు.యూపీ ఎన్నికలలో ఎంఐఎం సహకారంతో బీజేపీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారంటూ మండిపడ్డారు.