ఎప్పుడు డేర్ అండ్ డాషింగ్ అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తూనే వస్తున్నారు.ఒకపక్క బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలపై పోరాటం చేస్తూనే, అంతే స్థాయిలో సొంత పార్టీ నాయకుల రాజకీయాలను ఎదుర్కొంటూ వస్తున్నారు.
పిసిసి చీఫ్ రేస్ లో ఉన్న రేవంత్ రెడ్డి తనకే పదవి దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు.అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు తనకు ఆ పదవి దక్కకుండా ప్రయత్నిస్తున్న తీరుపైన రేవంత్ అసంతృప్తిగానే ఉంటూ వస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, గతంలో తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించిన ఆపరేషన్ బ్లూ స్టార్ అనే అంశాన్ని ఇప్పుడు రేవంత్ గుర్తు చేస్తున్నారు.ఇది తనను చంపేందుకే అనే విషయాన్ని రేవంత్ ఇప్పుడు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
తన సెక్యూరిటీ ని బాగా తగ్గించేశారని, సెక్యూరిటీ కోసం ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడంలేదని, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత భద్రత మొత్తం తీసేసారు అని, ఎంపీ అయిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే కేటాయించారని, కానీ ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉన్న దృష్ట్యా, అదనపు సెక్యూరిటీ కల్పించాలని రేవంత్ ఇప్పుడు ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ వ్యవహారంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సైతం రేవంత్ ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే బీజేపీ టిఆర్ఎస్ పైన రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.ఈ రెండు పార్టీలు పైకి మాత్రమే శత్రువులుగా విమర్శలు చేసుకుంటున్నా, బిజెపి టిఆర్ఎస్ లు ఒక అంగీకారంతో ముందుకు వెళ్తున్నాయని, రాష్ట్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ కేంద్రంలో మాత్రం సఖ్యతగా ఉంటున్నారంటూ రేవంత్ విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా బీజేపీకి సరెండర్ అయిపోయారని రేవంత్ విమర్శలు చేశారు.ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తన సత్తా చాటుకోవాలని చూస్తున్న తరుణంలో, అన్నాడీఎంకేతో పొత్తుకు బీజేపీ సిద్ధమని మెజార్టీ స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి పెట్టాలని చూస్తోంది , దీనికోసం తమిళనాడు ఎన్నికల ఇంచార్జి గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని నియమించింది.
అయితే కిషన్ రెడ్డి నియామకం వెనుక కెసిఆర్ ఉన్నారని, కేసీఆర్ సూచనలతోనే కిషన్ రెడ్డి కి తమిళనాడు బాధ్యతలు అప్పగించారని విమర్శిస్తున్నారు.అలాగే తెలంగాణకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు తమిళనాడు లో ఇప్పుడు బీజేపీకి సహకారం అందించేందుకు కేసీఆర్ పంపించారని, దీనిపై విచారణ చేపట్టాలంటూ రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.