లాజిక్ గా మాట్లాడుతూ తాను ఏమి చెప్పాలనుకుంటున్నానో ఆ విషయాన్ని ప్రజలకు సులువుగా అర్ధమయ్యేలా సెటైర్ రూపంలో చెప్పడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్టైల్.అతి స్వల్ప సమయంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా అటు ప్రజల వద్ద, ఇటు అధిష్టానం వద్ద మార్కులు వేయించుకున్నారు రేవంత్.
అయితే అదే సమయంలో సొంత పార్టీ నేతలతో తనకు ఏర్పడిన గ్రూపు తగాదాలు తల బొప్పి కట్టిస్తున్నా రేవంత్ మాత్రం తన దూకుడు తగ్గకుండా హవా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.అమెరికాలోని న్యూజెర్సీలో సోమవారం ఎన్నారైలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్లో రేవంత్ మాటలు అందరికి ఆసక్తి కలిగించాయి.
కేసీఆర్ పరిపాలన బాగుంటే ఆయన కుమార్తె నిజామాబాద్లో ఓటమిపాలు కావడం, రేవంత్రెడ్డి మల్కాజ్గిరిలో గెలవడం ఏమిటని ప్రశ్నించారు.సరైన సందర్భం వచ్చినప్పుడు ప్రకృతే రంగప్రవేశం చేస్తుందనడానికి నా గెలుపు, కవిత ఓటమే నిదర్శనమని రేవంత్ అన్నారు.
ప్రజలు ఊహించిన విధంగా తెలంగాణ లేదని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సివిల్ వార్ కు దారితీస్తాయేమోనన్న ఆందోళన కలుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు.అభివృద్ధికి నక్సలైట్లు అడ్డు, వారుండకూడదని గతంలో రైటిస్టులు భావించేవారు.
కానీ నక్సలైట్లే ఉంటే ప్రభుత్వ చర్యలను నియంత్రించేవారేమో అని సమాజం అనుకునే పరిస్థితి దాపురించింది అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల్లో తామెక్కడా హామీ ఇవ్వలేదని కేసీఆర్ చెబుతున్నారని, అయితే ఆర్టీసీని 50 శాతం ప్రవేటీకరిస్తామని అప్పుడూ చెప్పలేదు కదా అంటూ నిలదీశారు.