మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అసాధ్యుడు అనే చెప్పాలి.మొదటి నుంచి రేవంత్ దూకుడుగా ఉంటూ వస్తూనే ఉన్నారు.
ఆ దూకుడు స్వభావం ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టింది.తెలుగుదేశం పార్టీలో అతికొద్ది సమయంలో ఉండగా అతి కొద్ది సమయంలోనే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదిగారు.
ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ అభిమానులు ఉన్నారు.ఇక ఆ సంగతి పక్కన పెడితే, తెలంగాణ టిడిపి ఉనికి కోల్పోయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ అక్కడ తన హవా చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
ఇక పార్టీ నేతల నుంచి తగిన సహకారం లేకపోయినా, ఒంటరిపోరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం పై యుద్ధానికి వెళ్తున్నారు.ముఖ్యంగా సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ వ్యవహారంలో ఆయన ఎక్కువగా తలదూర్చి, వారిని ప్రజల్లో అభాసుపాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికీ కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారం లో రేవంత్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి పెద్దగా మద్దతు లేకపోయినా, రేవంత్ పట్టించుకోలేదు.
ఇక ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రేవంత్ జైలుకు కూడా వెళ్లారు.ఇక బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారంలో మరింత దూకుడు పెంచారు.
జన్వాడలో 111 జీవో కు విరుద్ధంగా అక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని రేవంత్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫిర్యాదు చేయడం, ట్రిబ్యునల్ నోటీసులు ఇవ్వడమే కాకుండా, రెండు నెలల్లో ఫామ్ హౌస్ వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా ఒక ప్రత్యేక కమిటీని నియమించడం జరిగింది.ఇదిలా ఉంటే రేవంత్ దూకుడు చర్యలతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందని, పార్టీ శ్రేణుల్లో కూడా రేవంత్ నమ్మకం పెరిగిందని, కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది.
బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న టిఆర్ఎస్ ను సమర్థవంతంగా ఢీ కొట్టాలంటే, అది రేవంత్ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని, ఆయన త్వరలో తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మార్పు విషయమై అధిష్టానం అభిప్రాయ సేకరణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.తాజాగా సోమవారం సీఎల్పీ ఆఫీస్ లో బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు వంటి నాయకులు రెండు గంటల పాటు రహస్యంగా మంతనాలు చేసినట్లు తెలుస్తోంది.రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి దక్కకుండా తెలంగాణ సీనియర్ నాయకులు అంతా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు.
కానీ అధిష్టానం మాత్రం రేవంత్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపిస్తుందని, త్వరలోనే ఆయనకు ఆ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.