తెలంగాణాలో సీఎం కేసీఆర్ ప్రజా పరిపాలనకంటే కల్వకుంట్ల సేల్స్ టాక్స్ వసూలుపైనే కేసీఆర్ దృష్టిపెట్టాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు.తెలంగాణలో ఎవరు ఏమి చేయాలన్నా ఆరు శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని రేవంత్ ఆరోపించారు.
మద్యం ధరల పెంపు వెనుక కల్వకుంట్ల సేల్స్ టాక్స్ ( కేఎస్టీ) మాఫియా ఉందంటూ ఆయన ఆరోపణలు చేసారు.ఈ వ్యవహారంలో ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి మరీ బేరం కుదుర్చారని రేవంత్ చెప్పుకొచ్చారు.
మద్యం ధరల పెంపుదల వెనుక భారీ కుంభకోణం ఉందని, వెంటనే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ఒకవేళ అలా చేయకపోతే తాము కోర్టుని ఆశ్రయిస్తామంటూ రేవంత్ లేఖ విడుదల చేసారు.
తెలంగాణాలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయిందంటూ ఆయన వెటకారం చేసారు.కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు అని, అందుకే కేసీఆర్ కమిషన్ కూడా ఆరు శాతమే తీసుకుంటున్నారంటూ రేవంత్ అనుమానం వ్యక్తం చేసారు.
అసలు లాటరీ విధానంలో మద్యం షాపులను ఎలా కేటాయిస్తారని, షాపు దక్కనివారికి డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడం ఏంటి అంటూ రేవంత్ ప్రశ్నించారు.తన ప్రశ్నలకు తక్షణమే కేసీఆర్ సమాధానం చెప్పాలంటూ రేవంత్ లేఖ ద్వారా డిమాండ్ చేసారు.