తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి.మొన్నటి వరకు కరోనా వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే విమర్శలు ఎదుర్కోగా, ఇప్పుడు పాత సెక్రటరీ కూల్చేస్తుండటం పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది.కేవలం మూఢ నమ్మకాలతోనే సెక్రెటరీయెట్ కూల్చివేస్తున్న అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది.
ఇక టిఆర్ఎస్ పార్టీని విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేత పై ఆయన స్పందించారు.
గవర్నర్ పిలిచినా రాకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనను ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఇక ఈ విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి మౌనంగా ఉండడం, కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఈ వ్యవహారాన్ని పట్టించుకోనట్టుగా ఉండడం పైన విమర్శలు చేశారు.
బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వం కలిసి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నాయని మండిపడ్డారు.పీవీ శత జయంతి రోజు మాయమైన కేసీఆర్ ఇప్పటివరకు కనిపించడం లేదని, అసలు కెసిఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ రేవంత్ డిమాండ్ చేశారు.
కొద్ది రోజుల నుంచి కేసీఆర్ ఆరోగ్యం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కు కరోనా సోకిందని, అందుకే ఫామ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్నారు అంటూ అనేక కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో రేవంత్ కెసిఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారనే అభిప్రాయంతో ప్రజలంతా హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని రేవంత్ అన్నారు.
సెక్షన్ 8 ఉపయోగించి హైదరాబాద్ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైద్యాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావాలని, కరోనా బాధితులకు చికిత్స అందించే విషయంలో ఒక్కో పేషెంట్ కు మూడున్నర లక్షలు ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వం చెబుతోందని, అసలు ఎంత మంది కరోనా పేషెంట్లకు ఎంత సొమ్ములు ఖర్చు పెట్టారు అనేదాన్ని బయట పెట్టాలంటూ రేవంత్ డిమాండ్ చేశారు.అలాగే హైదరాబాద్ లో భవనాలన్నీ గవర్నర్ అధీనంలో ఉంటాయని, సెక్రటరియేట్ కూల్చివేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయం పైనా రేవంత్ ప్రశ్నలు కురిపించారు.
.