దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తావన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తోంది.ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్య కాలంలో తరచుగా రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వస్తోంది.
దీనికి కారణం తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పేరుతో ఆయన కుమార్తె షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేయడమే.తెలంగాణలో ఎక్కువగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడంతో పాటు , పెద్ద ఎత్తున ఉన్న వైఎస్ అభిమానులు ఓట్లను సంపాదించే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు.
దీనిలో భాగంగానే తెలంగాణలో రాజన్న పాలన తీసుకు వస్తాము అంటూ ఆమె పదే పదే రాజశేఖరరెడ్డిని గుర్తుకు తెచ్చేలా ప్రసంగాలు ఇస్తున్నారు.ఇక ఏపీలో సంగతి చెప్పనవసరం లేదు .జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి పేరుతోనే ఉండడం, వైఎస్ అభిమానులను పూర్తిగా తన వైపు తిప్పుకోవడం లో ఆయన కుమారుడు జగన్ సక్సెస్ అవ్వడం వంటివి జరిగాయి.ఇప్పటికీ జనాల్లో జగన్ కు ఆదరణ ఉంది అంటే దానికి రాజశేఖర్ రెడ్డి కి ఉన్న చరిష్మా నే కారణం.
ఇప్పుడు అదే రాజశేఖర్ రెడ్డి చరిష్మా ఉపయోగించుకుని తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.పదేపదే వైఎస్ ప్రస్తావనను రేవంత్ తీసుకువస్తున్నారు.
ఇటీవల టిఆర్ఎస్ నాయకులు కృష్ణా జలాల విషయంలో రాజశేఖర్ రెడ్డి పై విమర్శలు చేయడం పై రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందిస్తున్నారు.రాజశేఖరరెడ్డిని ఎవరైనా విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఘాటుగా హెచ్చరిస్తున్నారు.
రేవంత్ టీడీపీలో ఉండగా రాజశేఖరరెడ్డిపై పదే పదే విమర్శలు చేస్తూ, ఆయన ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు.అయితే ఆయన కాంగ్రెస్ లోకి రావడంతో వైఎస్ పై ఎక్కడలేని అభిమానం చూపిస్తూ ఆయనను పదేపదే ప్రస్తావించడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.
తెలంగాణలో వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉండడంతో పాటు, రెడ్డి సామాజిక వర్గం మద్దతు కూడగట్టాలన్నా, దళిత మైనారిటీ వర్గాల్లో రాజశేఖరరెడ్డికి ఎక్కువ బలం ఉండడంతో ఆ వర్గాలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరి ముఖ్యంగా రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో రెడ్డి సామాజిక వర్గంతో పాటు వైఎస్ అభిమానులు ఆమె వైపు వెళ్లకుండా రేవంత్ వ్యూహాత్మకంగా వైఎస్ పేరును వాడుకుంటున్నట్టు గా కనిపిస్తున్నారు.ఏపీ సీఎం జగన్ వైఎస్ చరిష్మా ను వాడుకుని ఏవిధంగా అధికారంలోకి వచ్చారో అదేవిధంగా తెలంగాణలోనూ పెద్ద ఎత్తున ఉన్న వైఎస్ అభిమానుల అండదండలు అందేలా రేవంత్ చూసుకుంటున్నట్లు గా కనిపిస్తున్నారు.