తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాక రేపేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.కొద్దిరోజులుగా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ హడావుడి చేస్తున్న రేవంత్, ఆ పార్టీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.
అదీ కాకుండా, త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవిని భర్తీ చేసే విషయంలో అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తూ, కొంత మంది పేర్లను పరిగణలోకి తీసుకుంటూ ఉండడంతో మరింతగా రేవంత్ యాక్టివ్ అయ్యారు.పార్టీలోని గ్రూపు రాజకీయాలను అధిగమించి సమర్ధుడైన నాయకుడుగా నిరూపించుకోవాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకవేళ తనకు పిసిసి అధ్యక్ష పదవి దక్కక పోతే, కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే, త్వరలోనే తెలంగాణ అంతటా పాదయాత్ర చేపట్టాలని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లోని మిగతా నాయకులు తనకు కలిసి వస్తే, వారితో పాదయాత్ర మొదలు పెట్టాలని, అలా కాని పక్షంలో కోదండ రామ్ తో కలిసి పాదయాత్ర చేపట్టాలని రేవంత్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు త్వరలోనే దీనికి సంబంధించిన తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి రేవంత్ కాస్త పట్టు సంపాదించుకున్నారు.ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక విమర్శలు చేస్తూ, పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక పిసిసి అధ్యక్ష రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు తనకు గట్టి పోటీ ఇస్తారని ముందుగా అనుకున్నా, ఇప్పుడు ఆయన హవా బాగా తగ్గిందని, అలాగే మిగతా నాయకుల హడావుడి పెద్దగా లేదని, ఈ క్రమంలో తనకు తప్ప మరొకరికి ఆ పదవి ఇచ్చే ఛాన్స్ లేదనే అభిప్రాయంలో రేవంత్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.2023 లో టిఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు, కాంగ్రెస్ పార్టీతోనూ, అలా కుదరని పక్షంలో సొంత పార్టీ ద్వారా అయినా టిఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.ఇప్పుడు ఈ పాదయాత్ర వ్యవహారంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్ జోరుగా చర్చ జరుగుతోంది.