తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించని స్థాయిలో ఓటమిపాలయ్యింది.టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఆ పార్టీకి వ్యతిరేకంగా… కాంగ్రెస్ .
టీడీపీ .సీపీఐ .టీజేఎస్ ఇలా అన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి.అయినా ఫలితం మాత్రం దక్కలేదు.
కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులూ ఓటమిపాలయ్యారు.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ ను దైర్యంగా ఎదుర్కొనేలా నడిపించే నాయకుడి కోసం కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది.
ప్రస్తుతం ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మార్చాలని కూడా కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు.ఎన్నికలకు ముందు కూటమి గెలిచినా ఓడినా పూర్తీ బాధ్యత నాదే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
అంతేకాదు ఓడిపోతే గాంధీ భవన్ లో అడుగు కూడా పెట్టనని శపధం చేశారు.ఈ నేపథ్యంలో టి.పీసీసీ అధ్యక్షుడి మార్పు విషయమై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది.
మరో కొద్ది నెలల్లో పంచాయతీ, స్థానిక సంస్థలు, సహకార, మున్సిపాల్టీ, పార్లమెంట్ ఇలా వరుసగా ఎన్నికలు ఉన్నాయి.ఓటమి నిరుత్సాహంతో ఉన్న కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలంటే నాయకత్వ మార్పు జరగాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.ఇప్పటికే అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఆయన అయితేనే సమర్ధవంతంగా టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టగలరని కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నారట.