తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు పెద్ద దిక్కుగా మారిన రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఏమిటి అనేది ఆ పార్టీ అధిష్టానం గుర్తిస్తోంది.ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రాధాన్యం పెంచేందుకు రేవంత్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నా, సొంత పార్టీ నేతల నుంచి సరైన సహాయ సహకారాలు అందడం లేదు అనేది రేవంత్ అనుచరుల వాదన .
ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా, కాంగ్రెస్ ను అధికారం వైపు నడిపించేందుకు రేవంత్ గట్టిగానే కృషి చేస్తూ వస్తున్నారు.ఆయనకు ఎప్పటి నుంచో పిసిసి అధ్యక్ష పదవిని ఆ పార్టీ అధిష్టానం కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న సొంత పార్టీ నాయకులు అడ్డుకుంటూ వస్తున్నారు.
ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందే అవకాశం ఉండడంతో ఇప్పుడు అధిష్టానం వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇప్పటి వరకు రేవంత్ వాదన ను సరిగా అర్థం చేసుకోలేకపోయాము అని, ఇప్పటికైనా తేరుకొని ఆయనకు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించక పోతే గ్రేటర్ ఎన్నికలతో పాటు, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిల పడాల్సిందేనని, ఇదే వైఖరి కొనసాగితే రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు అవుతుంది అని, ఇలా ఎన్నో లెక్కలు ఆ పార్టీ నాయకత్వం వేసుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యతలను ఆయనకు అప్పగించాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ గ్రేటర్ ఇన్చార్జిగా ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తెలంగాణకు రాబోతున్నట్లు సమాచారం.
ఆయన తెలంగాణ పర్యటనలో రేవంత్ కు గ్రేటర్ బాధ్యతలు అప్పగించడంతో పాటు, ఈ ఎన్నికలపై అనుసరించాల్సిన వైఖరిపైనా, ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు అప్పగించాలి ? ప్రచార శైలి, అభ్యర్థుల ఎంపిక ఇలా అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే రేవంత్ ను బిజెపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన బిజెపిలో చేరినా, ఆయన హోదాకు తగిన పదవి ఇచ్చేందుకు సైతం బిజెపి పెద్దలు మొగ్గు చూపిస్తున్నారు.
ఇటువంటి పరిణామాలతో కాంగ్రెస్ లో టెన్షన్ మొదలైనట్టు గా కనిపిస్తోంది.అందుకే ప్రస్తుతం గ్రేటర్ ఇన్చార్జి బాధ్యతలతో పాటు , పిసిసి అధ్యక్ష పదవిని సైతం రేవంత్ కు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ విషయంలో పార్టీ సీనియర్ నాయకులు బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గినా, వారి వల్ల పెద్దగా ఉపయోగం కనిపించకపోవడం, పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి రావడం, మళ్లీ పార్టీకి పునర్ వైభవం తీసుకు రాగల సత్తా రేవంత్ మాత్రమే ఉందని నమ్మడం, ఇలా అనేక అంశాలను లెక్కలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.