తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి భర్తీ చేసే అంశం ఒక కొలిక్కి రావడంలేదు.ఎవరికి ఈ పదవి కట్టబెట్టినా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని, నాయకులు ఇతర పార్టీలో చేరే అవకాశం ఉందని, భయపడుతూ వాయిదా వేసుకుంటూ వస్తోంది.
కానీ రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇవ్వాలి అన్నది కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయం.ఈ విషయం కాంగ్రెస్ సీనియర్ల కు సైతం అర్థం అవ్వడంతోనే, మధ్యలో కాంగ్రెస్ లోకి వచ్చి చేరిన రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని , ఆయనకు ఇస్తే తాము కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతాము అనే హెచ్చరికలు చేయడంతో పాటు, పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలకు ఇదే విషయం చెప్పడంతో, ఆలోచనలో పడ్డ కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జీవన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగా మాత్రమే కాక టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తున్న వ్యక్తి.జగిత్యాల ఎమ్మెల్యే గా ఆయన ఓటమి చెందినా, ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి తన సత్తా చాటుకోగలిగారు.
అదీ కాకుండా మొదటి నుంచి ఆయన రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని ,ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనే విషయాన్ని పదేపదే చెబుతూ వస్తున్నారు.రేవంత్ రెడ్డి వర్గంగా జీవన్ రెడ్డి ముద్ర వేయించుకున్నారు.
అందుకే అటు సీనియర్ల అసంతృప్తికి చెక్ పెట్టేవిధంగా జీవన్ రెడ్డి కి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
ఇక రేవంత్ రెడ్డి కి ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తే, పీసీసీ అధ్యక్ష పదవి కి సమానమైన రేంజ్ లో ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కి సైతం చెప్పగా, ఆయన సానుకూలంగా స్పందించారని, అందుకే ఆయన అనేక టీవీ చానళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూ ల్లో తాను ప్రచార కమిటీ చైర్మన్ పదవి తీసుకుంటానని, అసలు పీసీసీ అధ్యక్ష పదవి, ప్రచార కమిటీ చైర్మన్ ఈ రెండిట్లో ఒక ఆప్షన్ తీసుకునే అవకాశం ఉంటే, తాను ప్రచార కమిటీ చైర్మన్ పదవే తీసుకుంటాను అంటూ రేవంత్ చెప్పడం చూస్తుంటే, అధిష్టానం నిర్ణయానికి రేవంత్ అంగీకారం తెలిపినట్లు గా కనిపిస్తోంది.ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడు కంటే ప్రచార కమిటీ చైర్మన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
అందుకే రేవంత్ ఈ పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు సమాచారం.