టిఆర్ఎస్ ప్రభుత్వం పై మొదటి నుంచి పోరాడుతున్న వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి ముందుంటారు.టిడిపిలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, కేసిఆర్ తమ రాజకీయ ప్రత్యర్థి అన్నట్లుగా ఆయన రాజకీయం కొనసాగుతూ వస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఎప్పుడూ టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ లో ఏమి జరుగుతుంది అనే విషయాలను అప్పుడప్పుడు రేవంత్ ప్రస్తావిస్తూ ఉంటారు.
ఆ విధంగా ఈటెల రాజేందర్ వ్యవహారాన్ని చాలా కాలం క్రితమే అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.ఎప్పటికైనా రాజేందర్ కు మంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పదని, టిఆర్ఎస్ లో ఆయనకు స్థానం ఉండదని, కెసిఆర్ మనస్తత్వం తనకు బాగా తెలుసునని, కుమారుడు కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ఈటెల రాజేందర్, హరీష్ వంటివారికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు అని అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు.
అంతేకాదు రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈటెలకు, హరీష్ రావు కు మంత్రి పదవులు కేటాయించకపోవడం పై విమర్శలు చేశారు.
ఆ తరువాత వారికి పదవులు దక్కడంతో, పార్టీకి చెడ్డపేరు వస్తుందని, ఉద్యమకారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కేసీఆర్ తనకు ఇష్టం లేకపోయినా వీరిద్దరికీ మంత్రి పదవులు ఇచ్చారు అంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది.
మంత్రి పదవి సంపాదించిన ఈటెల రాజేందర్ కు ఆ పదవి మధ్యలోనే పోతుందని, కరోనా వైరస్ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆయన, తన శాఖ విధులు నిర్వహచడంలో విఫలమయ్యారని కానీ, ఇతర కారణాలు చెప్పి కానీ, ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ గతంలోనే రేవంత్ విమర్శించారు.అయితే ఇప్పుడు కారణం ఏదైనా కానీ, రేవంత్ చెప్పినట్లుగానే ఈటెల రాజేందర్ పదవి అర్ధాంతరంగా పోవడంతో ఆయన చెప్పిందే నిజమయింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక హరీష్ రావు విషయంలోనూ రేవంత్ చెప్పినట్లే జరుగబోతోంది అనే సందేహాలు అందర్లోనూ కనిపిస్తున్నాయి.ఎందుకంటే హరీష్ రావు ప్రాధాన్యం గత కొంతకాలంగా తగ్గుతూ వస్తుండడంతో పాటు, ఆయన సాగునీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారనే విషయం బయటకు రావడం వంటి వ్యవహారాలతో హరీష్ రావు విషయంలోనూ ఏదో జరగబోతోంది అన్న సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.