తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బందు పథకాన్ని ఈనెల 16వ తేదీన ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే.లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టిఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.
అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం లక్ష మందితోనే ‘ దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరా ‘ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.కెసిఆర్ దళితులకు ప్రకటించినట్టుగానే గిరిజన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రధానంగా రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు ఈ నెల 9వ తేదీన ఇంద్రవెల్లి లో లక్ష మందితో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించి టిఆర్ఎస్ కు చెక్ పెట్టే విధంగా రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.అంతేకాదు లక్ష మందితో ఈ సభ నిర్వహిస్తామని, లక్ష మందికి ఒక్కరు తక్కువైనా గులాంగిరి చేస్తాను అంటూ రేవంత్ సవాల్ విసిరారు.
తుడుం దెబ్బ అంటే ఉడుము పట్టేనని నిరూపిస్తానని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కు సంబంధించి ఇందిరా భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
గిరిజనులు పడుతున్న కష్టాలను టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించడం లేదని , హుజురాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు ఇంటికి పది లక్షల చొప్పున కేసీఆర్ ప్రకటించారని, అవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలి అని డిమాండ్ చేశారు.
తమ పార్టీలో కెసిఆర్ కోవర్టులు ఇంకా ఎవరైనా ఉంటే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఆ తర్వాత ఎన్నికల్లోనూ అభ్యర్థిగా ఉంటాడని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.కెసిఆర్ 65వ కళ గా కోవర్టులను ప్రోత్సహిస్తూ, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని విమర్శలు చేశారు.
ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తామని, ఈ సభలో ఒక రోజు రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు.రాహుల్ పాల్గొన్న సభలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
అంతేకాకుండా రాహుల్ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నాలు చేయబోతున్నట్లు సమాచారం.