మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా అయిపొయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది.
అయినా ఫలితం కనిపించలేదు.ఆ తరువాత అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ ఎమ్యెల్యేలను తమ పార్టీలో చేర్చేసుకుంది.
ఈ దశలో కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేసే సమర్ధ నాయకత్వ అవసరం అత్యవసరం అయ్యింది.అదీ కాకుండా రోజు రోజుకూ ప్రభావం కోల్పోతున్న పార్టీని గాడిలో పెట్టేందుకు పార్టీలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.
దీనికోసం పీసీసీ అధ్యక్షుడిని ముందుగా మార్చి కొత్త వారికి ఆ ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది
మరోవైపు కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా కాంగ్రెస్ లో మిగిలి ఉన్న నాయకులను కూడా తమ పార్టీలోకి తీసుకురావాలని ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.తద్వారా తెలంగాణాలో బలపడి వచ్చే ఎన్నికల నాటికి అధికారం చేపట్టాలనే ప్లాన్ లో ఉంది.
దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అగ్ర నాయకులు పార్టీని పటిష్టం చేసేందుకు పీసీసీ చీఫ్గా కొత్తవారిని నియమించాలని నిర్ణయానికి వచ్చారు.గతంలో చాలామంది నాయకులు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనే డిమాండ్లు గట్టిగా చేసినా ఇప్పుడు ఈ పదవి చేపట్టడం కత్తి మీద సాముగా మారింది.
దీంతో ఈ పదవి కోసం పోటీ పడేవారి సంఖ్య బాగా తగ్గింది.ఈ నేపథ్యంలో రేవంత్ పేరును అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
రేవంత్ అయితేనే టీఆర్ఎస్ను ధైర్యంగా ఢీకొడతారనే పేరుంది.ఇక, ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి విజయం సాధించి సత్తా చాటారు.దీంతో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావడం ఫిక్స్ అయినట్టు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు.అలాగే ఈ రేసులో మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ నిన్నటి వరకు పీసీసీ చీఫ్ రేసులో కనిపించినా ఇప్పుడు మాత్రం వారికి అవకాశం లేదని తెలుస్తోంది.వారు బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఫిక్స్ అయిన నేపథ్యంలో రేవంత్ కు ఛాన్స్ దక్కే అవకాశం పుష్కలంగా ఉన్నట్టు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది.
రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే కాంగ్రెస్ కు క్రమంగా బలం పెరిగే అవకాశం ఉన్నట్టే.