ప్రజల్లో లో సులువుగా అభిమానం సంపాదించాలన్న, రాష్ట్రవ్యాప్తంగా తమ ఇమేజ్ ను పెంచుకొని తమ సత్తా చాటుకోవాలన్నా, నాయకులకు ముందుగా గుర్తుకు వచ్చేది పాదయాత్ర.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేపట్టి సంచలనం సృష్టించాడు.ఫలితంగా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఇదే ఫార్ములాను ఉపయోగించి అధికారంలోకి వచ్చారు.ఇక వైసీపీ అధినేత జగన్ కూడా పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చాడు.
మొత్తం ఈ పాదయాత్రలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఇమేజ్ పెరగడంతోపాటు అధికారంలోకి వచ్చేందుకు సులువైన మార్గంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఇదే ఫార్ములా ఉపయోగించి తన పరపతిని పెంచుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగానే ఉంది.కానీ ఇవేవి పట్టించుకోని ఆ పార్టీ సీనియర్ నాయకులు తమ గ్రూపు రాజకీయాలతో పార్టీకి మరింత చేటు చేస్తున్నారు.
తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున నిలబెట్టే అభ్యర్ధి విషయంలో రేవంత్ వర్సెస్ పార్టీ సీనియర్లు అన్నట్టుగా వ్యవహారం మారింది.రేవంత్ కు ప్రాధాన్యత తగ్గించడమే తమ ఎజెండాగా పెట్టుకున్నట్టుగా కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తాను పాదయాత్ర చేపట్టబోతున్నాని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే రేవంత్ వ్యూహాత్మకంగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది.గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ప్రధాన ఎజెండాగా చేసుకుని పాదయాత్ర చేస్తానంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ఇంటింటికి కుళాయి కనెక్షన్, రుణమాఫీ, రైతులకు పెట్టుబడి ఇలా అనేక పథకాలు ప్రకటించినా ప్రజల వరకు అవి చేరలేదని రేవంత్ విమర్శలు చేస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే తన ప్రధాన అజెండాగా రేవంత్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు చెబుతున్నా పార్టీలో సీనియర్ నాయకుల హవా తగ్గించి తన హావా పెంచుకోవాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.