అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది.ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి ) వేడి పెంచడంతో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.
ఇప్పటి కే ఈడీ అధికారులు రంగంలోకి దిగిపోయి ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టారు.ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న జెరూసలెం ముత్తయ్య ను విచారించగా, ఎమ్మెల్సీ ఎన్నికలలో స్టీఫెన్ సన్ తో ఓటింగ్ లో పాల్గొనేలా చేస్తే ఆయనకు 5 కోట్లు, తనకు 50 లక్షలు ఇస్తానని చంద్రబాబు సమక్షంలోనే రేవంత్ రెడ్డి చెప్పారని అధికారులకు చెప్పడంతో, ఈ కేసు చంద్రబాబు రేవంత్ రెడ్డి వంటివారు పూర్తిగా ఇరుక్కున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబు వంటి వారు అరెస్ట్ అవుతారా లేదా అని సంగతి పక్కనపెడితే, ఇంత అకస్మాత్తుగా ఓటుకు నోటు కేసు దర్యాప్తు ను ఈడీ అధికారులు మొదలు పెట్టడమే అనేక అనుమానాలకు తావిస్తోంది.,
ముఖ్యంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రచారంలోకి రావడం , ఆయన యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండడం వంటి కారణాలతోనే ఈ కేసు వేగవంతం అవుతున్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అదీ కాకుండా రేవంత్ బీజేపీ లోకి వస్తారని మొన్నటివరకు ప్రచారం జరిగినా, ఆయన కాంగ్రెస్ తోనే ఉండే అవకాశం ఉండడం, త్వరలోనే ఆయనకు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించే పరిస్థితులు కనిపిస్తుండడంతో, బిజెపి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుందనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.ఈ కేసులో ఎప్పుడో హైకోర్టు నుంచి తనకేమీ సంబంధం లేదు అని తీర్పు తెచ్చుకున్న ముత్తయ్య అనే ఫాస్టర్ కు నోటీసులు ఇచ్చి మరి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని మీడియాకు సైతం విడుదల చేశారు.
ఇప్పుడు పూర్తిగా రేవంత్ టార్గెట్ గానే ఈడి దర్యాప్తు మొదలు కావడం చూస్తుంటే, ఆయన దూకుడుకు బ్రేక్ లు వేసేందుకు ఈడీ కేసు దర్యాప్తు మొదలు పెట్టిందా అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.ఒకేసారి ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ కు చెక్ పెట్టేందుకు ఈ కేసును బిజెపి ఉపయోగించుకుంటుంది అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.