టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.ఆ పార్టీకి ఇంతకు ముందున్న రాజకీయ సమీకరణాలు మాత్రం పూర్తిగా మారిపోవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
ఎందుకంటే ఆయన పక్కా వ్యూహంతో దూరమైన ప్రతి వర్గాన్ని కూడా కాంగ్రెస్కు దగ్గర చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఓవైపు నేరుగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ వీలు కుదిరినప్పుడల్లా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే వస్తున్నారు.
అయితే ఇంకోవైపు కాంగ్రెస్ను అన్ని జిల్లాల్లో బలోపేతానికి పక్కాగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే చాలా జిల్లాల్లో తమ పాత నాయకులు ఏ పార్టీలో ఉన్న సరే వారిని తిరిగి తమ పార్టీలోకి రప్పించేందుకు రెడీ అవుతున్నారు.ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా టీఆర్ ఎస్ నుంచి తమ పార్టీలో చేరికలపై కీలకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఇక ఇప్పుడు ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక రేవంత్ వ్యూహాన్ని అమలు చేసేందుకు మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే అయిన సీతక్క రంగంలోకి దిగారు.ఈ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సెకండ్ గ్రేడ్ నాయకులతో ఇటీవల ఆమె సమావేశమైనట్లు తెలుస్తోంది.
కాగా ఈ ద్వితీయ శ్రేణి నాయకులతో సీతక్క సమావేశం కాగానే ఈ సమాచారాన్ని తెలుసుకున్న టీఆర్ ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు.ఇందులో భాగంగా సీతక్కతో సమావేశమైన ఓ కీలక నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జిల్లాలో పెను సంచలనంగా మారింది.
కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ అయినటువంటి బట్టా విజయగాంధీ ఇటీవల సీతక్కతో మీట్ అయ్యారని తెలుసుకున్న టీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పెద్ద దుమారమే రేగింది.ఇక త్వరోలనే ఆయనతో పాటు మరి కొందరు కీలకనేతలు పార్టీని వీడుతారని సమాచారం.