తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నా, సొంత పార్టీలోని అసంతృప్త నాయకులను, కోవర్టులు గా అనుమానం ఉన్న వారిని బయటకు పంపించే పనిలో ఉన్నారు.అటువంటి వారి వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం లేకపోగా, అదనపు భారంగా మారి అనవసర గందరగోళానికి కారణం అవుతారనే లెక్కల్లో రేవంత్ ఉన్నారు.
అదీ కాకుండా, ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల సందడి మొదలవడంతో, దానిపై దృష్టి సారించారు.ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.
ఇప్పటికే ఫైనల్ చేసిన ముగ్గురు పేర్లతో అధిష్టానానికి ఆయన నివేధిక పంపించారు.అయితే హుజురాబాద్ ఎన్నికల విషయంలో రేవంత్ పెద్దగా పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తున్నారని, కావాలనే బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తున్నారని, బిజెపి, కాంగ్రెస్ మధ్య ఓట్ల చీలిక రావడం వల్ల టిఆర్ఎస్ అభ్యర్థి సునాయాసంగా గెలుస్తారని, రేవంత్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో, దీనిపై రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
హుజురాబాద్ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, వ్యూహాలు, ప్రచారం మొత్తం ఎన్నికల కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి అంటూ రేవంత్ క్లారిటీ ఇచ్చారు.ఉప ఎన్నికల బాధ్యత 100% దామోదర రాజనర్సింహదే అని, ఉప ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఆయన అభ్యర్థితో సహా అన్ని వ్యవహారాలు చక్కబెట్టారు అని స్పష్టం చేశారు.
దామోదర కి మొత్తం అన్ని బాధ్యతలు అప్పగించినా , కొండా సురేఖ హుజురాబాద్ లో పోటీ చేసే విధంగా ఒప్పించడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా ఆమె డిమాండ్లకు రేవంత్ ఓకే చెప్పారు.
అయితే ఒకరి పేరు కాకుండా మరో ఇద్దరి పేర్లను అధిష్టానంకు పంపించే విషయంలో కీలక పాత్ర పోషించారు.ఒకపక్క హుజూరాబాద్ బాధ్యతలను చూస్తూనే, మరోవైపు దామోదర రాజనర్సింహ ద్వారా అన్ని పనులను చక్కబెట్టడం ద్వారా, వ్యూహాత్మక ఎత్తుగడకు తెరతీశారు.దామోదర రాజనర్సింహ దళిత వర్గానికి చెందిన వారు కావడం, ప్రస్తుతం కేసీఆర్ దళిత బంధు వంటి పథకాలతో ఆ వర్గం నేతలను, ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో దామోదర రాజనర్సింహ కి అన్ని బాధ్యతలు అప్పగించి, టిఆర్ఎస్ పై పైచేయి సాధించే విధంగా ఎత్తుగడలు వేస్తున్నారు.