ముంబైలో న్యూస్ ఛానల్స్ అక్రమ టీఆర్ఫీ రేటింగ్ భాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు.న్యూస్ ఛానల్స్ కొంత మందికి డబ్బులు చెల్లించి అక్రమ మార్గంలో టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటూ ప్రభుత్వం నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు.ఈ అక్రమ టీఆర్ఫీ రేటింగ్స్ విషయంలో మోసానికి పాల్పడిన మూడు జాతీయ మీడియా ఛానల్స్ కి ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈ విషయాన్ని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ భీర్ సింగ్ స్వయంగా వెల్లడించారు.ఈ మూడు ఛానల్స్ లిస్టులో ఇప్పుడు అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ కూడా ఉండటం గమనార్హం.
ఇప్పుడు ఇక్కడే అసలు రచ్చ మొదలైంది.రిపబ్లిక్ టీవీ టీఆర్ఫీ రేటింగ్ స్కామ్ లో ఉందని బయటకి రావడంతో దీనిపై ఛానల్ అధినేత అర్నాబ్ గోస్వామి రియాక్ట్ అయ్యాడు.
తాము టీఆర్ఫీ మోసాలకు పాల్పడుతున్నట్లు ముంబై పోలీసులు చేస్తున్న ఆరోపణలని తీవ్రంగా ఖండించారు.సుశాంత్ ఆత్మహత్య కేసు గురించి ప్రచారం చేయడంతో పాటు, ఆ కేసు విచారణలో ముంబై పోలీసులు వ్యవహరించిన తీరు, వారి వైఫల్యాన్ని ఎత్తి చూపించినందుకు పోలీస్ కమిషనర్ కక్షసాధింపు చర్యలకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
తాము ఎలాంటి టీఆర్ఫీ మోసానికి పాల్పడలేదని పేర్కొన్నారు.తమని ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి తమ ఛానల్ ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
దీనిపై తాను కోర్టుకి వెళ్తానని ముంబై పోలీస్ కమిషనర్ పై పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నారు.దీంతో ఈ టీఆర్ఫీ మోసం కేసు వ్యవహారంలో పోలీస్, రిపబ్లిక్ ఛానల్ మధ్య మరోమారు గొడవ మొదలైంది.
ఇది ఎంత వరకు వెళ్తుంది అనేది వేచి చూడాలి.