సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు రోజుకొక మలుపుతో క్రైమ్ స్టొరీని తలపిస్తుంది.అతని మృతికి కారణాలు వెతికే పనిలో ఉన్న పోలీసులకి కొత్త కొత్త చాలెంజ్ లు ఎదురవుతున్నాయి.
ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసుని ముంబై పోలీసులు విచారిస్తూ ఉండగా ఇప్పుడు సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో పాట్నా పోలీసులు రంగంలోకి దిగారు.వారు కూడా తమదైన శైలిలో విచారిస్తున్నారు.
ఇక సుశాంత్ ఆత్మహత్యలో రియా చక్రవర్తి పాత్ర గురించి కూపీ లాగుతున్నారు.ఇక సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో రియా చక్రవర్తి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యిందని భావిస్తున్నారు.
దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు.ఈ విచారణలో చాలా విషయాలు రియా వైపు వేలు చూపించేలా చేస్తున్నాయి.
అయితే తాజాగా ఈ వ్యవహారంలోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడు సిద్దార్ద్ ఎంట్రీ ఇచ్చాడు.గత ఏడాది నుంచి సుశాంత్ తో అతను కలిసి ఉన్నాడు.
దీంతో పోలీసులు అతనిని విచారించడం మొదలు పెట్టారు.సుశాంత్ రూమ్ లాక్ చేసుకున్న సంగతి ఆయన సోదరికి చెప్పిన సిద్ధార్థ్ తెలుగువాడే.
దగ్గరుండి తలుపులు తెరిపించింది కూడా సిద్ధార్థే.
సిద్ధార్థ్ పూర్తిపేరు పితాని సిద్ధార్థ్.
సినిమాలపై మోజుతో జైపూర్ లో ఓ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిద్ధార్థ్ ను సుశాంత్ గుర్తించాడు.అతడిలో ప్రతిభ ఉందని తెలుసుకుని తన బృందంలో ఒకడిగా అవకాశం ఇచ్చాడు.2019 నుంచి పితాని సిద్ధార్థ్ హీరో సుశాంత్ తో పాటు అతడి ఇంట్లోనే ఉంటున్నాడు.సుశాంత్ కుటుంబీకులు సిద్ధార్థ్ ను బుద్ధా అని ముద్దుగా పిలుస్తారట.
ఇంత సాన్నిహిత్యం ఉందని చెబుతున్న సిద్ధార్థ్ సుశాంత్, రియాల మధ్య రిలేషన్ వద్దకు వచ్చేసరికి తనకు ఏమీ తెలియదని, అలాంటప్పుడు ఏం జరిగిందో ఎలా చెప్పగలనని అంటున్నాడు.సుశాంత్ కేసును సీరియస్ గా విచారిస్తున్న పాట్నా పోలీసుల సిద్దార్ద్ ని విచారిస్తున్నారు.
ఈ క్రమంలో రియాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సుశాంత్ కుటుంబ సభ్యులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని సిద్ధార్ద్ మెయిల్ ద్వారా ముంబై పోలీసులకి ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.సడెన్ గా సుశాంత్ డెత్ మిస్టరీలోకి ఎంట్రీ ఇచ్చిన సిద్దార్ద్ పాత్ర గురించి ఇప్పుడు పోలీసులు కూపీ లాగుతున్నారు.