మొన్నటి వరకు తెలంగాణ బిజెపి, టిఆర్ఎస్ విషయంలో ప్రజల్లో ఉన్న అభిప్రాయం వేరు.ప్రస్తుత అభిప్రాయం వేరు.
టిఆర్ఎస్ ను తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేసి, తాము ఆ స్థానాల్లో కూర్చోవాలనే పట్టుదలతో తెలంగాణ బిజెపి నాయకులు అదేపనిగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ హడావిడి చేసేవారు.టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా, బిజెపి నేతలు టిఆర్ఎస్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేసేవారు.
దీనికి తగ్గట్లుగానే హుజురాబాద్ ఉప ఎన్నికల హడావుడి కూడా మొదలవడంతో, టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లుగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ, అక్కడ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కోసం తెలంగాణ బిజెపి నాయకులు గట్టిగానే కృషి చేస్తూ వస్తున్నారు.
ఇక తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ గత కొద్దిరోజులుగా పాదయాత్ర సైతం మొదలు పెట్టారు.
ఇంకా అది కొనసాగుతోంది.అయితే సంజయ్ పాదయాత్రకు మొదట్లో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు తగ్గినట్టుగానే కనిపిస్తోంది.
దీంతో తెలంగాణ బిజెపి నాయకులను ఈ విషయం కలవరానికి గురిచేస్తోంది .దీనికి కారణం కొద్దిరోజుల క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ తో ప్రత్యేకంగా భేటీ కావడం, ఆ తర్వాత అమిత్ షా తో సమావేశం, వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ ఇంకా ఢిల్లీలోనే మకాం వేసారు.అసలు కేసీఆర్ కు ప్రధాని, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరకడమే తెలంగాణ బిజెపి నాయకులకు అంతుపట్టడం లేదు.తెలంగాణాలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్నా, కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం కేసీఆర్ విషయంలో సానుకూలంగా ఉంటూ వస్తుండడం, తెలంగాణ బిజెపి నాయకులకు ఏమాత్రం రుచించడం లేదు.
ఇక ప్రజలలోనూ ఈ వ్యవహారంపై చర్చ జరుగుతూ ఉండడంతో, తెలంగాణ బిజెపి నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెసిఆర్ ను జైలుకు పంపిస్తామని, ఆయన అవినీతి వ్యవహారాలను విచారణ చేయిస్తాము అంటూ తెలంగాణ బిజెపి నాయకులు హడావుడి చేస్తూ కేంద్ర బిజెపి పెద్దలతో ఆయన సన్నిహితంగా మెలుగుతూ ఉండడంతో తెలంగాణ బీజేపీ నేతల పలుకులన్నీ ఉత్తుత్తి మాటలే అన్నట్లుగా జనాల్లో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం కేసీఆర్ డిల్లీ టూర్ బండి సంజయ్ పాదయాత్ర పై తీవ్ర ప్రభావం చూపుతోంది.కెసిఆర్ కేంద్ర బిజెపి పెద్దల మధ్య నడుస్తున్న సాన్నిహిత్యం చూస్తుంటే ఈ రెండు పార్టీలు అంతర్గతంగా ఒకే అభిప్రాయంతో ముందుకు వెళుతున్నాయి అనే అభిప్రాయాలు జనాల్లో కలుగుతూ ఉండడంతో సంజయ్ వంటివారు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఏముంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారాలన్నీ తెలంగాణలో కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తున్నాయి.