మూడు రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.అయితే అగ్రరాజ్యం ఎంతైనా డిఫరెంట్ కాబట్టి అక్కడ ఎన్నికల రోజు కంటే ముందుగానే దేశ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు వుంది.
దీనినే ఎర్లీ ఓటింగ్గా పిలుస్తారు.గత కొన్నేళ్లుగా ఈ ఎర్లీ ఓటింగ్ పెరుగుతూ వస్తోంది.
అయితే ఈసారి కరోనా కారణంగా రికార్డు స్థాయిలో ముందస్తు ఓటింగ్ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.ఇప్పటి వరకు సుమారు 8 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దీనికి కారణం కరోనానే.
జూలై- ఆగస్టులో అమెరికాను ఓ కుదుపు కుదిపిన కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్లో ఉగ్రరూపం చూపిస్తోంది.
గత 14 రోజుల్లోనే సుమారు 10 లక్షల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.దేశంలోని 50 రాష్ట్రాల్లో 24 రాష్ట్రాలు అత్యంత గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నాయి.శుక్రవారం ఒక్కరోజే 97,080 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షలు దాటగా, మరణాలు 2,29,594కి చేరుకున్నాయి.
అటు ఆసుపత్రులు సైతం కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయి.శుక్రవారం సుమారు 46,600 మంది హాస్పిటల్స్కు పరిగెత్తారు.
దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలో నవంబర్ 3న గుంపులు గుంపులుగా వెళ్లడం, క్యూలైన్లలో నిలబడటం వల్ల కోవిడ్ బారినపడే అవకాశం వుందని సగటు అమెరికన్ పౌరుడు భయపడుతున్నాడు.అందువల్ల వీరు ముందస్తు ఓటింగ్ వైపే మొగ్గుచూపుతున్నారు.
2016 అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం కలిపి 13.8 కోట్ల ఓట్లు పోలవ్వగా… అందులో 4.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్లో పాల్గొన్నారు.ఈసారి 8 కోట్ల మంది ముందుగా ఓటేశారు.అధ్యక్ష అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ సైతం ముందస్తుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మరోవైపు ముందస్తు ఓటింగ్లో ట్రంప్ కంటే జో బిడెనే ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది.కానీ వీటి ఆధారంగా విజేతను నిర్ణయించలేం.
గత అధ్యక్ష ఎన్నికల్లో నమోదైన ఎర్లీ ఓటింగ్లో అప్పటి డెమొక్రాటిక్ నేత హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉండగా.ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.
అయితే ఈసారి పరిస్థితి విభిన్నం.కరోనా నియంత్రణకు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మెజార్టీ అమెరికన్లు అసంతృప్తిగా ఉన్నారు.
ఈ క్రమంలో ఓటరు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.