వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు.పార్టీ నేతలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులోకి రావడంలేదు.
కొద్ది రోజులుగా ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లి వచ్చాడు.ఆ తరువాత నుంచి సైలెంట్ అయ్యాడు.
కానీ వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ మాత్రం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.క్షణం తీరికలేకుండా బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
కానీ జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం ఎవరికీ అంతుచిక్కడంలేదు.ఏపీలో వైసీపీ గెలుపు పక్కా అని వివిధ సర్వేలు, వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీమ్ ఇచ్చిన రిపోర్ట్ జగన్ లో కాన్ఫిడెన్స్ పెరిగి సైలెంట్ గా ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.
గత ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ లో విఫలమైన వైసీపీ ఈసారి మాత్రం సక్సెస్ అయ్యిందని అంటున్నారు.ఈ వాదనను టీడీపీ అభ్యర్థులు సైతం అంగీకరిస్తున్నారు.అయితే గెలుస్తామనే ధీమాతో పార్టీ నేతలెవ్వరూ రిలాక్స్ అవ్వొద్దని, జాగ్రత్తగా కౌంటింగ్ రోజు వరకు వ్యవహరించాలని పార్టీ నేతలకు జగన్ సూచనలు చేస్తున్నారు.పైకి సైలెంట్ గా ఉంటున్నా కౌంటింగ్ వరకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పక్కా వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారట.
దీనిలో భాగంగానే వైసీపీ అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.పార్టీ ముఖ్య నాయకులతో పాటు మాజీ సీఎస్ అజయ్ కల్లాం, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ ఈ కార్యక్రమానికి హాజరై కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు.
ఇప్పటివరకు ఎవరికీ పెద్దగా అందుబాటులో లేని జగన్ 19 వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందరికి అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలను, కౌంటింగ్ కు సంబందించిన విషయాలను పర్యవేక్షిస్తారట.ఇప్పటికే హైదరాబాద్ నుంచి అమరావతికి పార్టీ కార్యాలయాన్ని తరలించిన జగన్ 19వ తేదీన అమరావతి వెళ్లనున్నారు.అభ్యర్థులు, నేతలకు ఆయన అందుబాటులో ఉంటారు.ఇక, మ్యాజిక్ ఫిగర్ కు అటూఇటూ ఆగిపోతే తమ పార్టీకి చెందిన ఎమ్యెల్యేలను టీడీపీ ప్రలోభపెట్టి లాక్కునే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.
అందుకే ఎవరూ చేజారిపోకుండా అందరి మీద నిఘా ఏర్పాటు చేయించాడట జగన్.మొత్తానికి జగన్ సైలెంట్ గా ఉన్నట్టే కనిపిస్తున్నా పార్టీ పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టే కనిపిస్తున్నాడు.
.