టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.సినిమాల్లో స్కిన్ షోకు దూరంగా ఉంటూ రెమ్యునరేషన్ కంటే తన పాత్రకే ప్రాధాన్యతనిస్తూ సౌందర్య తరువాత ఆ రేంజ్ హీరోయిన్ గా సాయిపల్లవి గుర్తింపును తెచ్చుకున్నారు.
అయితే గతంలో ఒక ప్రముఖ కంపెనీ సాయిపల్లవికి యాడ్ లో నటించే ఆఫర్ ఇచ్చిందని.కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేసిందని వార్తలు వచ్చాయి.
అయితే ఆ యాడ్ లో నటించడానికి సాయిపల్లవి మాత్రం ఆసక్తి చూపలేదు. 2 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా సాయిపల్లవి ఆ ఆఫర్ ను వదులుకోవడం గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిపల్లవి ఆ యాడ్ ను తన వ్యక్తిగత అభిప్రాయం మేరకే రిజెక్ట్ చేశానని వెల్లడించారు.ప్రస్తుతం సమాజంలో శరీరం ఛాయ, అందానికి సంబంధించి ఎంతో విలువ ఉందని సాయిపల్లవి తెలిపారు.
తాను మొటిమల సమస్య వల్ల చాలాసార్లు ఇబ్బంది పడ్డానని.మొటిమల వల్ల ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లని రోజులు తన జీవితంలో ఉన్నాయని.ఫెయిర్ నెస్ క్రీముల సహాయంతో మొటిమలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించానని వెల్లడించారు.మొటిమల సమస్యతో బాధ పడుతున్న సమయంలో చాలామంది తన కళ్లలో కాకుండా మొటిమలను చూస్తూ మాట్లాడేవారని తెలిపారు.
ప్రేమమ్ సినిమాలో తాను మొటిమలతోనే కనిపించానని ప్రేక్షకులు తనను తనలానే ఇష్టపడ్డారని.మొటిమలు ఉన్నా సక్సెస్ కావడం వల్ల తాను ఎంతోమంది అమ్మాయిలకు ప్రేరణగా నిలిచానని పేర్కొన్నారు.
తన సోదరి తెల్లగా, అందంగా కనిపించడం కోసం ఇష్టం లేని ఆహార పదార్థాలను తినేదని తనలో ప్రేరణ నింపడానికైనా ఆ యాడ్ ను చేయకూడదని తాను అనుకున్నానని 2 కోట్ల రూపాయల ఆఫర్ ను వదులుకోవడం వెనుక అసలు కారణాలను సాయిపల్లవి వెల్లడించారు.