టాలీవుడ్ ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.హీరో కృష్ణ తనయుడు ఘట్టమనేని రమేష్ బాబు తాజాగా అనారోగ్యం కారణంగా మృతి చెందారు.
రమేష్ బాబు మరణవార్తతో సినీ ఇండస్ట్రీతో పాటు, ఘట్టమనేని ఫ్యామిలీ లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.రమేష్ బాబు మరణ వార్త విన్న చాలామంది షాక్ కు గురయ్యారు.
గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు తాజాగా జనవరి 8న అతని పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు అతనిని వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు.అయితే అప్పటికే రమేష్ బాబు మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
దీనితో కృష్ణ ఇంట్లో ఒక్కసారిగా పెను విషాదం చోటు చేసుకుంది.
ఇప్పటికే రమేష్ బాబు మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రమేష్ బాబు సినిమాలలో నటిస్తూ ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు.అయితే అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.రమేష్ బాబు మొదట తన తండ్రి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ లాంటి మంచి మంచి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
ఆ తరువాత పలు సినిమాల్లో నటించి 1987 లో వచ్చిన సామ్రాట్ సినిమాతో హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించాడు.ఆ తర్వాత హీరోగా 15 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఆ తర్వాత 1997లో ఎన్కౌంటర్ సినిమాలో సహాయ నటుడిగా కనిపించారు.
అదే నటుడిగా ఆయన చివరి సినిమా.హీరోగా దాదాపు 15 చిత్రాల్లో నటించినప్పటికీ కథల ఎంపిక సరిగా లేకపోవడంతో రమేష్ బాబు సక్సెస్ కాలేకపోయారని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
నటనకు ముగింపు పలికాక నిర్మాతగా మారిన రమేష్ బాబు సోదరుడు మహేష్ బాబుతో అర్జున్, అతిథి చిత్రాలు, హిందీలో అమితాబ్ బచ్చన్తో సూర్యవంశం చిత్రాలు నిర్మించారు.