ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే భేటీ అయ్యారు.తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన అనిల్ కుంబ్లే కాసేపు జగన్ తో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా తన కెరీర్ లో కీలక ఘట్టాలకు సంబంధించిన ఫోటోలతో కూడిన మెమొంటోను కుంబ్లే సీఎం జగన్ కు అందించారు.సీఎం జగన్ కూడా కుంబ్లేను సత్కరించిం శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహుకరించారు.
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.గత ప్రభుత్వ హయాంలో అనిల్ కుంబ్లే ఏపీలో మెరుగైన క్రీడాకారులను తయారు చేసే ప్రాజెక్టులో భాగమైన సంగతి తెలిసిందే.
భారత జట్టు ప్రధాన కోచ్ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులను కుంబ్లే చేపట్టాడు.కర్ణాటకకు చెందిన అనిల్ కుంబ్లే ఏపీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
దానికి సంబంధించి కుంబ్లే సీఎం జగన్ తో భేటీ అయ్యాడని సమాచారం.సీఎం జగన్, కుంబ్లేల మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఏపీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ పెడితే తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లేకి జగన్ చెప్పినట్టు తెలిసింది.క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీని పెట్టే అంశంపైనా దృష్టి సారించాలని కోరినట్టు తెలుస్తోంది.
జలంధర్, మీరట్ లాంటి నగరాలనుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటామని చెప్పాడు.
ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని కుంబ్లే సీఎంకు వివరించినట్టు సమాచారం.మరి త్వరలోనే కుంబ్లే ఏపీలో తన పాగా విస్తరించనున్నాడు.దీనివల్ల ఏపీలోని క్రీడాకారులకు ఎన్నో రకాలుగా మేలు జరిగే అవకాశం ఉంది.
మొత్తానికి కుంబ్లే చూపు ఏపీపై పడడంతో మిగిలిన పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్ల చూపు కూడా ఏపీపై పడనున్నట్లు తెలుస్తోంది.