టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటూనే వస్తూ ఉంటారు.తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా ఆయన గతం కంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ వైసీపీ ప్రభుత్వం పైన, జగన్ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు.
టిడిపి రాజకీయ వారసుడు ఎవరు అనే విషయంలో గత కొంత కాలంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, లోకేష్ గతం కంటే ఇప్పుడు స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తున్నాడు.విమర్శలు చేయడం లోనూ , పార్టీ నాయకులకు భరోసా కల్పించే విషయంలోనూ లోకేష్ గతంకంటే యాక్టివ్ అయ్యారు.
చంద్రబాబు తర్వాత తానే అసలు సిసలైన వారసుడిని అని, పార్టీని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించగల సమర్థుడుని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం శాసనమండలిలో లోకేష్ అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా, సభలో జరుగుతున్న పరిణామాలను తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి వివాదాస్పదం అయ్యారు.
ఈ విషయంలో అధికార పార్టీ లోకేష్ ను ఇరుకున పెట్టాలని చేసింది.కాకపోతే మండలిలో లోకేష్ అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడం, విమర్శలను తిప్పి కొట్టడం వంటి పరిణామాలను తెలుగుదేశం పార్టీలో చర్చగా మారాయి.
అయితే మండలి వ్యవహారం తర్వాత నుంచి లోకేష్ సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.
నిత్యం మీడియాలో ను, సోషల్ మీడియాలోనూ అందుబాటులో ఉంటూ, విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఉండే లోకేష్ అకస్మాత్తుగా సైలెంట్ అవ్వడం వెనుక వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
ప్రస్తుతం టిడిపి మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారు.అనేక అవినీతి ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం చేయడమే కాకుండా, గత టీడీపీ ప్రభుత్వం లో నెలకొన్న అక్రమాలను వెలికి తీస్తోంది.
సాక్ష్యాధారాలతో సహా కేసులు నమోదు చేస్తుండడం తో తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది.ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో లోకేష్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు చేస్తూ, ఈ వ్యవహారంలో ఆయన పాత్రను నిరూపించేందుకు చూస్తూ ఉండడం వంటి పరిణామాలతో ఇప్పుడు కాస్త లోకేష్ సైలెంట్ అయినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.