దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 13 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 10 పరుగుల తేడాతో విజయ దుందుభి మ్రోగించింది.టాస్ గెలవడంతో సన్ రైజర్స్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం వలన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కు దిగింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ను దేవదూత్ పడిక్కల్, అరోన్ ఫించ్లు ప్రారంభించి, ఏకధాటిగా ఆడి RCB స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికిగాను 163 పరుగులు చేసింది.
పడిక్కల్ చాలా స్టేబుల్ గా ఆడి, హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.ఫించ్ కాస్త నెమ్మదిగా ఆడి పాడిక్కాల్ కు సపోర్ట్ గా నిలబడ్డాడు.పడిక్కల్ 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు బాదగా, తర్వాత ఫించ్ దూకుడు పెంచే యత్నంలో అభిషేక్ శర్మ బౌలింగ్లో ఎల్బీగా అవుట్ అయ్యాడు.ఎన్నో అంచనాల మధ్య దిగిన కోహ్లి కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు.
కాగా.164 పరుగుల లక్ష్యం ఛేదనగా దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ సాధారణ స్కోరును సైతం ఛేదించలేక చతికిలబడింది.యజ్వేంద్ర చహల్ తన బౌలింగ్తో మ్యాజిక్ చేసి, తిరుగులేని విజయాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి అందించాడు.ఒకే ఓవర్లో వరుస బంతుల్లో బెయిర్ స్టో(61) ను బౌల్డ్ చేసిన చహల్.ఆ తర్వాత బంతికి విజయ్ శంకర్(0)ని పెవిలియన్ బాట పట్టించాడు.16వ ఓవర్ లో 3, 4 బంతుల్లో చహల్ వికెట్లు సాధించి మ్యాచ్ను మలుపు తిప్పాడు.ఇకపోతే, గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ ను సన్ రైజర్స్ చేజేతులా పాడు చేసుకుంది.చహల్కు జతగా నవదీప్ సైనీ రెండు వికెట్లు సాధించి కీలక పాత్ర పోషించాడు.18 ఓవర్ లో భువనేశ్వర్ కుమార్(0), రషీద్ ఖాన్(6)లను బౌల్డ్ చేశాడు.దూబే వేసిన 19 ఓవర్లో మిచెల్ మార్ష్(0) ఔట్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఒత్తిడి తీవ్ర స్థాయిలో పెరిగింది.
చివరి వికెట్గా సందీప్ శర్మ(9) ఔట్ కావడంతో సన్రైజర్స్ ఓటమి చవిచూడక తప్పలేదు.