మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లో కీలక నేతగా ఉన్న ఎంపీ రాయపాటి సాంబశివరావు 2014 లో టీడీపీ లో చేరిన సంగతి తెలిసిందే.అయితే ఆయన కుటుంబం నుంచి రాయపాటి సోదరుడు ఇప్పుడు వైసీపీ లో చేరారు అన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఏపీ రాజకీయాల్లో ఎంపీ రాయపాటి కుటుంబానికి ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.ఆయన అడుగుజాడల్లోనే సోదరుడు రాయపాటి శ్రీనివాస్ కూడా ఇప్పటివరకు నడిచేవారు.
అయితే ఇప్పుడు శ్రీనివాస్ వైసీపీ లో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రాయపాటి ఆరు సార్లు ఎంపీ గా ఎన్నికవ్వగా ఆయన సోదరుడు శ్రీనివాస్ ఎమ్మెల్సీ గా గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు.
అయితే ఇప్పుడు వారి రాజకీయ వారసులుగా మోహన్ సాయి కృష్ణ,రంగబాబు లు అడుగుపెట్టారు.అయితే ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయంటూ టీడీపీపై మోహన్ సాయికృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో మోహన్ సాయి కృష్ణ హోదా విషయంలో కాంగ్రెస్, టీడీపీలను ఏ1, ఏ2 నిందితులు అని, ఏ3, ఏ4 జనసేన, బీజేపీ పార్టీ అంటూ పలు ఆరోపణలు చేశారు.
అయితే సాయి కృష్ణ అన్నీ పార్టీలపై ఆరోపణలు చేశారు కానీ, ఒక్క వైసీపీ పార్టీ పై పెదవి విప్పక పోవడం తో ఇప్పుడు ఆయన వైసీపీ లో చేరే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మోహన్ సాయికృష్ణ తండ్రి శ్రీనివాస్ సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ నుంచి సీటు ఆశించి భంగపడ్డారు.ఇలాంటి సమయంలో మోహన్ సాయికృష్ణ టీడీపీపై విమర్శలు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల ఫలితాలు రాకముందే రాయపాటి కుటుంబంలో ఒకరు పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మోహన్ సాయి వ్యాఖ్యలతో ఇప్పుడు రాయపాటి సాంబశివరావు సోదరుడి కుటుంబం టీడీపీ వీడనుందా? వైసీపీలో చేరే ఆలోచన చేస్తోందా? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.