అప్పట్లో సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ప్రేమ నగర్. ఈసినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావు హీరోగా, వాణి శ్రీ హీరోయిన్ గా నటించారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తండ్రి ప్రకాశరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.రామానాయుడు నిర్మించిన ఈ సినిమా 1971లో విడుదలై అద్బుత జనాదరణ దక్కించుకుంది.
అదే సమయంలో ఏపీలో తుఫాన్ బీభత్సం కలిగించింది.పలు జిల్లాల్లో పది రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి.అయినా ఈ సినిమా బాగానే ఆడింది.13 సెంటర్లలో 100 రోజులు ఆడింది.ఈ సినిమా రామానాయుడు ఆర్థికంగా బలపడేలా చేసింది.
ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ 1972 జనవరి 10న మద్రాసులో ఘనంగా జరిగింది.
ఈ వేడుకలకు అప్పటి ప్రముఖులు హాజరయ్యారు.నాటి తమిళ సీఎం కరుణానిధి, నటసార్వభౌమ ఎన్టీఆర్, తమిళ లెజెండరీ హీరో శివాజీ గణేషన్ ముఖ్య అతిథులుగా వచ్చారు.ఈ సందర్భంగా జాతీయ రక్షణ నిధికి సురేష్ ప్రొడక్షన్స్ ఇచ్చిన రూ.10 వేలను కరుణానిధి తీసుకున్నారు.అటు విజయా ప్రొడక్షన్స్ అధినేత నాగిరెడ్డి కూడా అప్పటికే జాతీయ రక్షణ నిధికి ఇచ్చిన రూ.25 వేలకు తోడు మరో రూ.10 వేలు అదనంగా ఇచ్చాడు.వీరితో పాటు మరికొన్ని సినిమా నిర్మాణ సంస్థలు విరాళాలు అందించాయి.
ఈ సందర్భంగా మూవీ మొఘల్ డి.రామానాయుడు స్వాగతోపన్యాసం చేశాడు.ఈ వేడుకను నవయుగ ఫిల్మ్స్ ప్రతినిధి కాట్రగడ్డ సరసయ్య నిర్వహించారు.కరుణానిధి, రామారావు, నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, దాశరథి మాట్లాడారు.ప్రేమ నగర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.అటు ఈ సినిమాను తమిళంలో శివాజీ గణేషణ్ తసంత మాళిగై పేరుతో తీశాడు.
హిందీలో ఈ సినిమాను రాజేష్ ఖన్నా చేశాడు.అక్కడ కూడా ఈ సినిమాకు ప్రేమ్ నగర్ అని పేరు పెట్టారు.
ఈ రెండు భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అక్కినేని నాగేశ్వర్ రావు కెరీర్ లోనే ఈ సినిమా ఎన్నో మర్చిపోలేని మధుర అనుభూతులను మిగిల్చింది.
ఈ విషయాన్ని అక్కినేని ఎన్నోసార్లు వెల్లడించాడు కూడా.