ఏపీలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతోంది.ఒక పార్టీని మించి మరో పార్టీ ఎన్నికల హామీలు ఇస్తూ ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తి పోస్తూ ఎక్కడ లేని హడావుడి చేస్తున్నారు.
ఎన్నికల బరిలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, జనసేన తదితర పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ అంతా వైసీపీ- టీడీపీ మధ్యే అన్నట్టుగా ఉంది.ఇదే సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ఈ రోజు ఈ పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఏ పార్టీలో ఉంటాడో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.పార్టీలు కూడా ఎవరు వచ్చినా తమకు ఒకే అన్నట్టుగా చేర్చేసుకుంటున్నాయి.
ఈ ఎఫెక్ట్ తో అనేక నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.ఈ రేసులో జనసేన కూడా ఉన్నప్పటికీ ఆ పార్టీ రెండు ప్రధాన పక్షాల స్థాయి లో పోటీ పడలేకపోతుంది.
పేరున్న నేతలు అధికార పార్టీ లేదా విపక్ష పార్టీలవైపే తమ చూపంతా పెట్టడంతో రాజకీయ యుద్ధం అంతా ఈ రెండు పార్టీల మధ్యనే కొనసాగేలా కనిపిస్తోంది.రెండు ప్రధాన పార్టీలకు అధికారం దక్కించుకోవడానికి సంఖ్య బలం తక్కువైతే తమ చేతిలో ఎన్ని స్థానాలు ఉన్నా తాము నిర్ణయాత్మక శక్తిగా మారతామన్న ఆశతో జనసేన ఉంది.
దానికి అనుగుణంగానే బలమైన నియోజకవర్గాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది.దీనిలో భాగంగా రాజమండ్రిలో భారీ సభ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో జనసేన ఉంది.బలమైన నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించిన ఆ పార్టీ ఆయా ప్రాంతాల్లో చేరికలు ప్రోత్సహించే పనిలో జనసేన ఉంది.
టీడీపీ కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది.తమ పార్టీలో చేరితే ఫలానా పదవి మీకే అంటూ ఆఫర్లు ప్రకటిస్తోంది.మరో సారి అధికారం దక్కించుకోవడం ద్వారా తమ పార్టీ బలం పుంజుకోవడంతో పాటు వైసీపీని కోలుకొని విధంగా దెబ్బకొట్టవచ్చని టీడీపీ ప్లాన్ వేస్తోంది.
ఇక ప్రతిపక్ష పార్టీ గా ఉన్నప్పటికీ వైసిపి అధికార పార్టీని మించిన స్పీడ్ తో దూసుకుపోతుంది.సిట్టింగ్ ఎంపిలు, ఎమ్యెల్యేలు ఎక్కువమంది ఆ పార్టీలో చేరుతూ ఉండడంతో ఎక్కడలేని హుషారు కనిపిస్తోంది.
టీడీపీ అవినీతి అక్రమాలను ప్రధానంగా వెలుగులోకి తెచ్చి ప్రజల్లో పలుచన చేయాలని వైసీపీ భావిస్తోంది.ఈ ఎన్నికల యుద్ధం లో గెలుపు తమదంటే తమదే అంటూ గంభీరంగా ప్రకటించుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.