కరోనా వైరస్ కారణంగా ప్రజలు, ప్రభుత్వాలు తీవ్ర టెన్షన్ ఉన్నాయి.యావత్ ప్రపంచం ఈ పెను విపత్తు ను ముందుగా ఊహించలేకపోయాయి.
కేవలం కరోనా చైనాకే పరిమితమైందని అందరూ తేలిగ్గా తీసుకున్నారు.ఇక అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది.
ఈ వ్యాధి నివారణకు మందులు కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడంతో ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువవుతోంది.ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా అన్నిరకాలుగా అడ్డుకుంటున్నా, తెలంగాణలో రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిపై ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఒకరు తెలంగాణలో మృతి చెందారు.ప్రస్తుతం తెలంగాణలోని ఐదు జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండగా, మిగతా చోట్ల ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.హైదరాబాద్, కరీంనగర్, భద్రాద్రి -కొత్తగూడెం రంగారెడ్డి,మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.ఈ జిల్లాలో తప్పించి మిగతా ఎక్కడా ఈ కేసుల సంఖ్య నమోదు కాలేదు.
మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.వాటిలో ఆరు కేసులను మినహాయిస్తే మిగిలిన అన్నీ గ్రేటర్ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి.
ఇక్కడ జనాభా ఎక్కువగా ఉండడంతో పాటు, విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తి నట్లుగా తెలుస్తోంది.
మహా నగర పరిధిలో ఉండే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండడంతో పాటు, జనాభా సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు.
ఒక్క శంషాబాద్, కోకాపేట ఐటీ కారిడార్ లో ఎక్కువ సంఖ్యలో హోమ్ క్వారంటైన్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుతం కేసీఆర్ 5 జిల్లాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ఈ ప్రాంతాల నుంచి మిగతా జిల్లాలకు వైరస్ రాకుండా పూర్తిగా కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.