ఈ మధ్యకాలంలో దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో అందరికి తెలిసిందే.అత్యాచారం, హత్య చేస్తున్న వారిని శిక్షించడం కోసం చట్టాలు సరైన విధంగా పని చేయకపోవడంతో పాటు, ఇలాంటి కేసులలో ఆలస్యం కావడం, రోజురోజుకు పెరిగిపోతున్న సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు మగాళ్ళని మరింతగా మృగాల్లలా మార్చేస్తున్నాయి.
కంట్రోల్ లేని సిస్టంతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.నిర్భయ ఘటన తర్వాత తాజాగా హైదరాబాదులో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా మరో సారి అత్యాచారాలపై చట్టాలు పునరాలోచించేలా చేశాయి.
ఈ నేపధ్యంలో ఈ ఘటనల మీద ఈ మధ్య కాలంలో కోర్టులు త్వరితగతిన శిక్షలు ఖరారు చేస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇప్పటికే దిశ ఘటనలో నిందితులని పోలీసులు ఎన్కౌంటర్ చేయగా, నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు అయ్యింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంజినీరింగ్ విద్యార్ధిని అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.నిర్భయ ఘోరం జరిగి నాలుగేళ్లు నిండిన రోజే 2016 డిసెంబర్ 16న రాహుల్ రాజ్ అనే వ్యక్తి రాంచీలోని ఓ ఇంజినీరింగ్ విద్యార్ధినిపై అత్యాచారం చేసి చంపేశాడు.
ఆ తరువాత ఆ ఘటన మీద సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు, విస్తృత గాలింపు చేపట్టి గతేడాది నిందితుడిని అరెస్ట్ చేశారు.అప్పటికే అతడు మరో నేరంలో జైలుకెళ్లి శిక్ష అనుభవిస్తూ ఉండటం గమనార్హం.
అతడి కేసులో 30 మంది సాక్షులను విచారించిన కోర్టు సరిగ్గా ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష పడిన రోజే సీబీఐ కోర్టు రాహుల్ కుమార్ ని దోషిగా ప్రకటించింది.అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
అయితే ఈ తీర్పు ఉన్నావ్ తీర్పు కారణంగా మీడియా దృష్టికి రాకుండా పోయింది.