చాలా సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు మెగా, నందమూరి కలయికలో ఒక చిత్రం వస్తే చూడాలని ఆశపడ్డారు, ఆశ పడుతూనే ఉన్నారు.చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించాలని ప్రేక్షకులు ఆకాంక్షించారు.
కాని వారిద్దరి కలయికలో సినిమా రాలేదు.కాని వారి తర్వాత తరం హీరోలు మల్టీస్టారర్తో సిద్దం అవుతున్నారు.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ల కలయికలో దర్శకధీరుడు రాజమౌళి ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
భారీ అంచనాలున్న ఈ చిత్రం ఇంకా పూర్తి కాకుండానే ఈ అరుదైన కలయికలో రెండవ సినిమా గురించి సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
జక్కన్న వీరిద్దరితో ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, వీరిద్దరు చాలా మంచి స్నేహితులు అయ్యారు.ఆ కారణంగానే వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ తర్వాత వెంటనే మరో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ బ్యానర్లో ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడట.
కొణిదెల ప్రొడక్షన్స్లో ఎన్టీఆర్ మూవీ అంటూ మెగా మరియు నందమూరి కాంపౌండ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ ప్రారంభించిన కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్లో ఇప్పటికే ఖైదీ నెం.150 చిత్రం తెరకెక్కి మంచి విజయాన్ని దక్కించుకుంది.ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి కూడా అదే కొణిదెల ప్రొడక్షన్స్లో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
భారీ చిత్రాలను నిర్మించాలని పట్టుదలతో ఉన్న రామ్ చరణ్ తనకు మిత్రుడు అయిన ఎన్టీఆర్తో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.అందుకు సంబంధించిన ఒప్పందం కూడా జరిగినట్లుగా సమాచారం అందుతుంది.
ప్రస్తుతం వీరిద్దరు చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత జక్కన్న మల్టీస్టారర్లో నటించబోతున్నారు.ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో అంటే చరణ్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతుంది.
ఈలోపు ఎన్టీఆర్ కోసం ఒక మంచి కథను రెడీ చేయాల్సిందిగా ఇద్దరు ముగ్గురు రచయితలకు మరియు దర్శకులకు చరణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది.ఈ కాంబో ఒక్కసారి అంటేనే రికార్డులు బద్దలు ఖాయం.
అదే రెండవ సారి కూడా అంటే మామూలుగా రచ్చ ఉండదేమో అంటూ ఇప్పటి నుండి మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.