తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు టీటీడీపై విమర్శలు కురిపించారు.ఆలయ పూజారుల రక్షణ విషయంలో టీటీడీ విఫలమైందని రమణ దీక్షితులు ఆరోపించారు.
కరోనా వైరస్ బారిన పడి కన్నుమూసిన ఆర్చకుల కుటుంబాలను ఆదుకోవాలని రమణ దీక్షితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయా అర్చక కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అన్నారు.
సీనియర్ ప్రధాన అర్చకుడిని టీటీడీ పాలక మండలి తొలగించిందని., అనంతరం ఆయన వంశపారంపర్యాన్ని సేవలను పునరుద్ధరించాలని పోరాడారని రమణ దీక్షితులు గుర్తు చేశారు.
మరోవైపు 45 ఏళ్ల జూనియర్ అర్చకులు స్వామివారి సేవలో విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడి మరణించారని రమణ దీక్షితులు అన్నారు.అర్చకుల కుటుంబాలను ఆదుకోవడంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు విఫలమయ్యారని అన్నారు.
ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రమణ దీక్షితులు సీఎం జగన్ కు విజ్ఙప్తి చేశారు.ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
తిరుమలలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే.టీటీడీలో ఇప్పటి వరకు 743 మంది కరోనా బారిన పడ్డారు.
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు కరోనా వల్ల మరణించారు.తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యుటేషన్ పై తిరుమలకు వచ్చిన అర్చకుడు కరోనా బారిన పడి మృతి చెందారు.